ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఎనిమిదో విడత పనులు జోరందుకున్నాయి. వానకాలం ప్రారంభమవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మొక్కలు నాటే ప్రక్రియ షురూ అయింది. ఇప్పటికే ప్రభుత్వం శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించగా, అన్ని పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో బాదం, వేప, కానుగు, చింత, మామిడి, జామ, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, గులాబీ, మందార, మల్లె తదితర మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా అక్కడ మొక్కలు నాటాలని సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాలో1,16,73,406 మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకోగా 1,07,26,500 మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. రెండు వారాల్లో 36,56,121 నాటారు. మెదక్ జిల్లాలో 34.42లక్షలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హరితహారం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిక చేయడంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మెదక్, సంగారెడ్డి (నమస్తే తెలంగాణ, జూలై 21) : తెలంగాణను పచ్చని తోటలా తయారు చేసేలా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటిస్తున్నారు. అడవులు ఉన్న చోటనే అధిక వర్షాలకు నిలయంగా మారుతున్నాయని గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. వర్షాలు సమృద్ధ్దిగా పడితే రైతులకు చేతినిండా పనితో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఎనిమిదో విడత హరితహారంలో జిల్లాలో1,16,73,406 కోట్ల మొక్కలు నాటేందుకు అధికారులు అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలలోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను నాటునున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 36,56,121 మొక్కలు నాటారు. వానకాలం ప్రారంభమై భారీ నుంచి మోస్త్తరు వర్షాలు కురువడంతో ప్రభుత్వం 1,16,73,406 కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు కావాల్సిన మొక్కలను జాతీయ ఉపాధిహమీ పథకంలో భాగంగా గ్రామ నర్సరీలను ఏర్పాటు చేసి పండ్లు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కల పెంపకం చేపట్టారు. ఎనిమిదో విడత హరితహారంలో నాటేందుకు 77 రకాల మొక్కలను అధికారులు పెంచుతున్నారు. అలాగే ప్రభుత్వ శాఖలవారీగా లక్ష్యాలను నిర్దేశించి మొక్కలు నాటాలని ఇదివరకే సంబంధిత శాఖలకు కలెక్టర్ అదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ఆయా పంచాయతీలకు అధికారులు అప్పగించి మొక్కల ఎదుగుదలకు చర్యలు తీసుంటున్నారు.
ప్రభుత్వశాఖలను కేటాయించిన లక్ష్యాల చొప్పున మొక్కలు నాటి సంరక్షణ చేసే బాధ్యతను ఆయా శాఖలకు అప్పగించారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక బాధ్యతలు తీసుకొని గ్రామస్తుల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు పక్కా ప్రణాళికలు తయారు చేసి అమలు చేసేందుకు సిద్ధ్దంగా ఉన్నారు.
అందుబాటులో 1.16 కోట్ల మొక్కలు
ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో 1,16,73,406 మొక్కలు నాటేందుకు అధికారులు టార్గెట్ నిర్ణయించగా, జిల్లాలోని గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో 1,07,26,500 సిద్ధ్దంగా ఉన్నాయి. లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసి గ్రామస్థాయి సిబ్బందికి లక్ష్యాలు నిర్ధేశించారు. జిల్లాలోని 639 ఈజీఎస్ నర్సరీల్లో మొక్కలు పెంచగా నాటేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. మొక్కలు పెరిగి చెట్లుగా ఎదిగి భవిష్యత్లో కాలాలకనుగుణంగా వర్షాలు పడుతాయని పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయపడుతున్నారు. కానీ 70 ఏండ్ల చరిత్రలో ఏ ప్రభుత్వాలు మొక్కలు నాటేందుకు శ్రద్ధ్ద చూపక పోయినా అభివృద్ధి పేరుతో ఉన్న చెట్లను నరికివేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పచ్చని తెలంగాణ తయారు చేస్తామని ప్రకటించిన విధంగా సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రతి ఏటా మొక్కలు నాటేందుకు లక్ష్యాలు నిర్ధేశించుకొని వాటి సంరక్షణ బాధ్యతలు ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలు, అధికారులు, సిబ్బందికి అప్పగించారు.
సంగారెడ్డిలో నర్సరీలో సిద్ధంగా ఉన్న మొక్కలు
అన్ని ప్రదేశాల్లో మొక్కలు నాటాలి..
ప్రభుత్వం ఆశించిన ఫలితం రావడానికి సమయం పడుతున్నదని, ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని నీరుగార్చే అధికారులపై కొరడా ఝుళిపించేందుకు సర్కారు చర్యలకు సిద్ధమవుతునట్లు తెలుస్తున్నది. అందుకోసం రోడ్లకు ఇరువైపులా, డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, చర్చిలు, రైతు వేదికలు, పొలం, చెరువు గట్లు, నివాసాల ఎదుట, విద్యా సంస్థలు, చెరువులు, శిఖం భూములు, బృహత్తర ప్రకృతి వనాలు, ఇతర ప్రాంతల్లో మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. త్వరలో ఎనమిదో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రోడ్ల పక్కల-3.50 లక్షల మొక్కలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, చర్చిలలో-10లక్షలు, రైతులకు టేకు, పండ్ల, ఫలాలు, పొలం గట్లపై-22లక్షలు, ఇంటికి 6 మొక్కల చొప్పున-15లక్షలు, విద్యా సంస్థలు-1.20లక్షలు, అడవుల్లో హరిత వనాలు-5లక్షలు, చెరువులు, శిఖంలలో-3లక్షలు, ఇతర ప్రాంతాల్లో మొత్తం 55 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేశారు. గతేడాది నాటిన మొక్కల్లో తప్పిపోయిన ప్రాంతాలు-2.50లక్షల చొప్పున మొక్కలు నాటేందుకు అద్ధికారులు ఏర్పాట్లు చేశారు.
వారం రోజుల్లో 21 లక్షల మొక్కలు నాటినం..
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాం. జిల్లాలో పెట్టుకున్న లక్ష్యం మేరకు 77 రకాల మొక్కలు సిద్ధ్ద్దం చేశాం. గ్రామాల్లో ఈజీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెంచిన మొక్కలు నాటేందుకు అందుబాటులో ఉంచాం. జిల్లాలో 1,16,73,406 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నాం. రెండు వారాల్లో 36,56,121 మొక్కలు నాటాం. అన్ని నర్సరీల్లో 1,07,26,500 మొక్కలు నాటేందుకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించి జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాము. గుంతలు తీయడం నుంచి నాటిన మొక్కలను సంరక్షించే వరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్నది. బృహత్ ప్రకృతి వనాలు, సంస్థలు, నివాసాలు, రోడ్లకిరువైపులా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత ఆయా రంగాలు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి.
– మణికుమార్, ప్లాంటేషన్ అధికారి, సంగారెడ్డి