సంగారెడ్డి, ఏప్రిల్ 13: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని, బడే బాయ్ తనపై జర నజర్ పెట్టు అని చోటే బాయ్ మాటలు బట్టీ తెలుస్తుందని మాజీమంత్రి హరీశ్రావు చురకలంటించారు. శనివారం సంగారెడ్డి నియోజకవర్గ విద్యార్థి, సోషల్ మీడియా, యువతతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
సమ్మేళనాన్ని టీఆర్ఎస్వీ నియోజకవర్గ చైర్మన్ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బీజేపీతో కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకుని అభ్యర్థులను బరిలో నిలిపిందని, బీజేపీ బలమైన అభ్యర్థులకు గులాం గిరి చేసే ప్రక్రియలో భాగంగానే ఈ ఒప్పందం చేసుకుందని ఎద్దేవా చేశారు.
నాలుగు నెలల క్రితం వరకు రాష్ట్రంలో సాగు, తాగు నీళ్లకు ఇబ్బందులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. నాలుగేండ్ల పాటు ప్రజలు అవస్థలు పడక తప్పదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఓడించి తెలంగాణ పౌరుషాన్ని చూపించాలని పిలుపునిచ్చారు.
రంజాన్ పండుగకు తోఫాలు పంపిణీ చేయలేని పరిస్థితి రావడం సిగ్గుచేటన్నారు. గతంలో అన్ని వర్గాల ప్రజల పండుగలకు ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుందని, కాంగ్రెస్ హయాం లో ఎందుకీ పరిస్థితి వచ్చిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకలవుతామని, నాలుగు నెలల్లో ఆగం పట్టించి ప్రజలను మభ్య పెట్టడంలో కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ అధికారిగా పనిచేసిన అనుభవంతో ప్రజాసేవ చేసేందుకు బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా నిలబెట్టామని, ప్రజలు ఆశీర్విదించి పార్లమెంటుకు పంపించాలని కోరారు.
రూ.100కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ప్రజల ఆకాంక్షలను నిలబెట్టుకోవాలని హరీశ్రావు యువతకు పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, నరహరిరెడ్డి, బుచ్చిరెడ్డి, వరలక్ష్మి, మనోహర్ గౌడ్, రాజేశ్వర్రావు దేశ్పాండే, పాండురంగం, యువత విభాగం, విద్యార్థి, సోషల్ మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మాయమాటలకు మోసపొవద్దు: ఎమ్మెల్యే చింతా
మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత వాగ్ధానాలకు మోసపొవద్దని, లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వాలని యువతను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. విద్యావంతుడిగా, మాజీ కలెక్టర్గా మనకు సుపరిచితుడైన అభ్యర్థిని గెలిపిస్తేనే తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. దేవుడిపై రాజకీయాలు చేస్తున్న బీజేపీకి బుద్ధిచెప్పాలని, అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని కోరారు.
సేవకుడిగా పనిచేస్తా: వెంకట్రామిరెడ్డి
మాటిస్తే ప్రాణమిస్తానని, ప్రజలు ఆశీర్వదిస్తే సేవకుడిగా పనిచేస్తానని ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో గళం విప్పి నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో రూ.100కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీయువకులకు అండగా నిలుస్తానన్నారు.