రైతుకు రుణవిముక్తి చేయడం.. పేదోడికి గూడు కల్పించడం.. దళితులు సగర్వంగా బతికేలా చేయడం.. ప్రతి ఎకరాకు నీరందించడం.. పేదలు, విధివంచితులు, అభాగ్యులకు సామాజిక భద్రత కల్పించడం.. ఇలా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేయగా.. సబ్బండ వర్ణాలు మురిసిపోయాయి. ప్రజల ఆకాంక్షలు ఫలించేలా.. అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా 2023-24 రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యరంగాలతో పాటు దళితబంధు, సంక్షేమానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేయడాన్ని అన్నివర్గాలు స్వాగతించాయి. ఏ ఒక్క వర్గాన్నీ విస్మరించకుండా ప్రభుత్వం మంచి బడ్జెట్ ప్రకటించిందంటూ ఆర్థిక నిపుణులు అభినందిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్రావును అసెంబ్లీలో కలిసి అభినందనలు తెలిపారు.
సిద్దిపేట, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం కేటాయింపులు చేయడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సకల జనుల బడ్జెట్గా అందరూ అభివర్ణిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2023-24 రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ, సాగునీరు, విద్య, వైద్యరంగాలతో పాటు దళితబంధు, సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. రైతు రుణమాఫీకి భారీగా నిధులు కేటాయించడంతో ఇది రైతు ప్రభుత్వమని అన్నదాతలు సంబుర పడుతున్నారు.
ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేయనున్నది. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించడంతో జిల్లా రైతులకు మేలు జరుగనున్నది. ఉమ్మడి జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఒక్క సిద్దిపేట జిల్లాలో ఏడాదిలో 6వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేశారు. జాగ ఉండి ఇంటి నిర్మాణం చేసుకోవాలనే పేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పేదలు సంబుర పడుతున్నారు.
ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను సైతం విడుదల చేసింది. ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు మంచి వేతనాలు ఇస్తుండడంపై ఆ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్లో నిధులు అత్యధికంగానే కేటాయింపులు జరిగాయి. పల్లె, పట్టణ ప్రగతికి కార్యక్రమాలు, హరితహారం, తదితర రంగాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక నిధులు, రోడ్ల అభివృద్ధికి, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, సంక్షేమ రంగంలో ఆసరా తదితర పథకాలకు పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయించడంతో అన్నివర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ నుంచి వారి సర్వీసులను క్రమబద్ధీకరించనున్నది. సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ సవరణ చేయనున్నది.సిద్దిపేట ఐటీ టవర్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ఎంతోమందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
రైతులకు లక్ష వరకు రుణమాఫీ…
ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా రైతు రుణమాఫీని ప్రభుత్వం చేస్తున్నది. దీనికి ఈసారి భారీగా నిధులు కేటాయించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో1,67,771 మంది రైతులు అర్హులు కాగా, ఇప్పటి వరకు రూ. 25వేల లోపు రుణం పొందిన వారు 20,146 మంది రైతులకు రూ. 27.14 కోట్లు, రూ.50వేల లోపు రుణం పొందిన 24,600 మంది రైతులకు రూ.87.00 కోట్లు మాఫీ చేసింది. మిగతా అర్హులైన రైతుల లక్ష రూపాయల రుణం పూర్తిగా మాఫీ కానున్నది. మెదక్ జిల్లాలో రుణమాఫీకి 1,53,883 మంది అర్హులు కాగా, వీరిలో ఇప్పటి వరకు 25వేల లోపు వారు 22,097 మంది రైతులకు రూ.34.12 కోట్లు, రూ. 50 వేలలోపు ఉన్న 24,200 మందికి రూ.85.0 కోట్లు మాఫీ చేసింది.మిగిలిన వారికి మాఫీ కానున్నది. సంగారెడ్డి జిల్లాలో 1,90.002 మంది రైతులు అర్హులు కాగా, ఇప్పటి వరకు రూ. 25 వేలలోపు రుణాలకు 20,503 మంది రైతులకు రూ. 30.53 కోట్లు, రూ. 50వేల వరకు 24,765 మంది రైతులకు రూ. 89.2 కోట్లు మాఫీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఒక్కో లబ్ధ్దిదారుడికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది. దళితుల రక్షణ కోసం దళితనిధి సైతం ఏర్పాటు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడతలో 1,194 కుటుంబాలకు దళితబంధును రాష్ట్ర ప్రభుత్వం అందించింది. సిద్దిపేట జిల్లాలో 495 కుటుంబాలకు రూ.45.50 కోట్లు, మెదక్ జిల్లాలో 255 కుటుంబాలకు రూ.25.50 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 444 కుటుంబాలకు రూ.44.40 కోట్లు అందించింది. లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేసుకుని విజయవంతంగా రన్ చేసుకుంటున్నారు.
సంక్షేమ పద్దు
వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులకు నెలనెలా ఆసరా పథకం ద్వారా పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం సామాజిక భద్రత కల్పిస్తున్నది. పింఛన్ అర్హత వయసును 57ఏండ్లకు కుదించింది. ఫైలేరియా, డయాలసిస్,ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆసరా పింఛన్ అందిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద పేదింట ఆడపిల్ల పెండ్లికి రాష్ట్ర ప్రభుత్వం లక్షా నూట పదహార్లు అందిస్తున్నది. అమ్మాయి తల్లి బ్యాంకు ఖాతాలోనే ఈ డబ్బులు జమ చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసింది. ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నది. కేసీఆర్ కిట్లను అందిస్తున్నది. నేతన్నకు చేయూత పథకం కింద రైతు బీమా మాదిరిగానే రూ.5 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల సాయం అందిస్తున్దని. గతంలో రూ.2 లక్షలు ఇచ్చేది.
ఆసరా పింఛన్ లబ్ధిదారుల వివరాలు..
రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఫైలేరియా, ఎఆర్టీ, డయాలిసిస్ రోగులకు ఆసరా పింఛన్ అందిస్తున్నది. తాజాగా 57 ఏండ్లు నిండిన వారికి సైతం పింఛన్ అందించడంతో వారంతా ఖుషీగా ఉన్నారు. పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ అండగా నిలిచారు.
పల్లెప్రగతితో మారిన రూపురేఖలు
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలు అద్భుత ప్రగతిని సాధిస్తున్నాయి. గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణతో పాటు హరితహారంలో మొక్కల పెంపకం చేపడుతున్నారు. గ్రామీణా ప్రాంతాల్లో అత్యధిక శాతం జనాభా ఉంది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందనున్నది.ఇంటింటా చెత్త సేకరణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ను అందించింది. హరితహారం ఉట్టి పడేలా ప్రతిగ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసింది. ఆ గ్రామానికి కావాల్సిన మొక్కలను అక్కడి నుంచి తీసుకెళ్లి నాటుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లిన పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తున్నది. డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు నిర్మించారు. ప్రతినెలా గ్రామపంచాయతీలకు నిధులు వస్తున్నాయి. గ్రామాల్లో పరిశుభ్రత పెరగడంతో ప్రజారోగ్యం మెరుగుపడింది. దోమల బెడద, మలేరియా వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయాయి.
మనఊరు- మనబడి
రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడి, మనఊరు-మనబస్తీ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో తొలివిడతగా 341 పాఠశాలలను చేర్చారు. వీటిలో 184 ప్రాథమిక 33 ప్రాథమికోన్నత, 124 ఉన్నత పాఠశాలలున్నాయి. సుమారు 55 వేల మంది విద్యార్థులు విద్యనభసిస్తున్నారు. ఇటీవల 36 పాఠశాలలను అభివృద్ధి చేసుకుని ప్రారంభించారు. మెదక్ జిల్లాలో 313 పాఠశాలలను ఎంపిక చేసి 33 బడుల్లో తొలి విడతలో పనులు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలను ఎంపిక చేసి 66 బడుల్లో పనులు పూర్తిచేసి ఇటీవల ప్రారంభించారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు
ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. ఇందుకోసం బడ్జెట్లో డబ్బులను కేటాయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చింది. సొంత జాగా ఉన్నవారికి ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రతి నియోజకవర్గానికి రెండు వేల ఇండ్లను బడ్జెట్లో కేటాయించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉన్నాయి. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మెదక్, నర్సాపూర్, ఆందోల్, నారాయణ్ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 2వేల చొప్పున 22,000 ఇండ్లు రానున్నాయి. జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీ, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలాలు ఉన్నాయి. ఇవి అన్ని కలుపుకుంటే సుమారుగా 23 వేల ఇండ్ల వరకు జిల్లాకు వస్తాయి.
సీఎం కేసీఆర్ రైతులకు పది విడతలుగా(ప్రస్తుత యాసంగిని కలుపుకొని) రైతుబంధును అందించారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు పది విడతల్లో రైతులకు అందిన సాయం వివరాలు.
ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ప్రభుత్వ అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. రైతుబీమాతో రైతు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి.వచ్చిన బీమా పరనిహారంతో అప్పులు తీర్చుకోవడంతో పాటు మిగిలిన డబ్బులతో చిరు వ్యాపారం లేదా వ్యవసాయ పనిముట్లు, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈ పథకాన్ని 2018 ఆగస్టు 15న ప్రారంభించింది. ఇప్పటి వరకు రైతు కుటుంబాలకు అందిన సాయం వివరాలు.
దళితుల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట
బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించి, దళితుల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేయడం హర్షనీయం. దళితులు స్వయం సాధికారిత సాధించి, ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడాలేనివిధంగా రూపొందించిన అద్భుత పథకం దళితబంధు కోసం రూ.రూ.17,700 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36750 కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం. దళితుల పక్షాన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఏర్పుల బాల్రాజ్, బీఆర్ఎస్కేవీ మెదక్ జిల్లా ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి
అన్ని వర్గాలకు సముచిత న్యాయం
రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు సర్కారు సముచిత న్యాయం ఇచ్చారు. సీఎం కేసీఆర్ సర్కారులో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయడానికి బడ్జెట్ ప్రవేశ పెట్టడం హర్షణీయం. ఇలాంటి బడ్జెట్ అన్ని రాష్ర్టాలకు ఆదర్శం అవుతుందని ఆశీస్తున్న.
– సద్ది ప్రవీణ, ఎంపీపీ, గుమ్మడిదల
ఈహెచ్సీ అమలు మంచి నిర్ణయం
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్సీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని బడ్జెట్ సమావేశంలో ప్రకటిండం ఆనందకరంగా ఉంది. ఇందులో ప్రభుత్వ ప్రతినిధి, ఉద్యోగ, ఉపాధ్యాయులను, విశ్రాంత ఉద్యోగులను భాగస్వామిగా చేయడం మంచి నిర్ణయం.
– మల్లారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
రుణమాఫీకి నిధులు ఇవ్వడం భేష్
రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ రుణమాఫీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రూ.6385 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరం. సీఎం కేసీఆర్ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు ముందుకువస్తున్నారు.
– కిషన్రెడ్డి, రైతు, చండూర్, చిలిపిచెడ్ మండలం
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్…
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సర్కారు పని చేస్తున్నది. బడ్జెట్లో రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ మేరకు మంత్రి రుణమాఫీ కోసం నిధులు కేటాయించడం హర్షణీయం. రైతులకు ఉపయోగకరమై ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి అమలు చేసిన దాఖలాలు గత ప్రభుత్వాల హయాంలో కనిపించలేదు.
– రమేశ్, యువ రైతు, సిర్గాపూర్ మండలం
ఇది రైతు సంక్షేమ బడ్జెట్
రైతు సంక్షేమానికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమాలాంటి వాటికి ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత లభించింది. ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతాంగాన్ని ఆదుకుంటున్నారు. నేడు మన రైతులు దేశంలోనే ఆర్థికంగా ఎదుగుతున్నారు. గత ప్రభుత్వాలతో పోల్చితే ఈ ప్రభుత్వం రైతుల సంంక్షేమానికి కట్టుబడి ఉందని తెలుస్తున్నది.
– మ్యాకల కనకయ్య, మర్కూక్
అన్ని వర్గాలకు అనుకూలమైన బడ్జెట్
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలవారికి ఆమోదయోగ్యంగా ఉంది. విద్య, వైద్యం, నీటిపారుదల రంగాలకు అధిక నిధులు కేటాయించటం శుభ పరిణామం. 2023-2024 బడ్జెట్ మంచి ఫలితాలు సాధిస్తుంది. దళితులకు రూ.17,700, షెడ్యూల్డ్ కులాల వారికి రూ.36,750 వేల కోట్లు నిధులు కేటాయించడం మంచి పరిణామం. ఇంత వరకు ఇంత మంచి బడ్జెట్ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు.
– కిరణ్కుమార్, న్యాయవాది, కోహెడ
ఎవుసానికి పెద్ద పీట
ఇయ్యాల అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లో రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ సార్ ఎవుసానికి పెద్ద పీట ఎయ్యడం శానా సంతోషంగా ఉంది. ఎవుసం ముందుకు సాగి రైతులు అన్ని రకాలుగా ఆర్థికంగా ఎదుగడానికి సీఎం కేసీఆర్ సార్ ఎంతో కష్టపడుతున్నారు. మా రైతులందరం సీఎం కేసీఆర్ ఎంటనే ఉంటాం.
– మద్దెల సంతోష్, రైతు, మిరుదొడ్డి
అన్ని వర్గాలకు ప్రాధాన్యం…
2023-24 సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఉపయోగపడేలా ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. సామాన్య ప్రజలకు నచ్చేలా బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరొక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం.
– రణం జ్యోతీ శ్రీనివాస్ గౌడ్, దౌల్తాబాద్ జడ్పీటీసీ
రైతులకు పెద్దపీట
బడ్జెట్ బాగుంది. రైతులను ఆదుకునేలా అన్ని అంశాలు పెట్టిండ్రు. మొదటి నుంచి రైతులకు కావాల్సిన ఉచిత కరెంట్, రైతుబీమాతో రైతుల పక్షాన ఆలోచించి ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్కు రైతులంతా రుణపడి ఉన్నరు. ఎక్కడి నుంచో కాళేశ్వరం నీళ్లు తెచ్చి బీడు భూములకు ఇస్తుండు. రైతు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్న సర్కారు తెలంగాణ.
– గుర్రం రాములు, రైతు, పెద్దలింగారెడ్డిపల్లి, సిద్దిపేటరూరల్ మండలం