మెదక్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామా ల పరిధిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో స్థానికుల అభిప్రాయాలను తుంగలో తొకుతూ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రైతులు, స్థానికుల ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదన్నారు.
ప్రజలను, ప్రజాప్రతినిధులను అర్ధరాత్రి నుంచి ఎందుకు అక్రమ అరెస్టులు చేసి పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి, భయానక వాతావరణాన్ని సృష్టించారని, అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించారని పేర్కొన్నారు.సీఎం రేవంత్రెడ్డి పాలనలో ప్రజలు, ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే హకులేదా? ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చి, అప్రజాస్వామిక విధానాలు అనుసరించడం మీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన హరీశ్రావు డిమాండ్ చేశారు.