దుబ్బాక/దుబ్బాక టౌన్, జనవరి 2 : ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అధికారం కోల్పోయామని కార్యకర్తలు అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం దుబ్బాకలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ కృతజ్ఞత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకు స్పీడ్బ్రేకర్ లాంటివి అని, పార్టీకి జయాలు, అపజయాలు కొత్త కావన్నారు. ముళ్లబాటలు, పూలబాటలు అన్నీ చూశామని, ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అధికారమే తప్పా ప్రజల సమస్యలు పట్టవని దుయ్యబట్టారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని, కేసీఆర్ రైతుబంధు ఇచ్చి అండగా నిలిచారని గుర్తుచేశారు.
కార్యకర్తలు అధైర్యపడొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. దుబ్బాకలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో దుబ్బాకలో మంగళవారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన సభ జరగగా, ముఖ్యఅతిథిగా హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్యే తెలంగాణకు శ్రీరామరక్ష అని, పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలు స్పీడ్బ్రేకులాంటివి అన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నటికీ మరువరన్నారు. తప్పులను సవరించుకొని సమష్టిగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలో పెద్ద మెజార్టీలు సాధించిన స్థానాల్లో దుబ్బాక నిలుపడం కార్యకర్తల పట్టుదలకు నిదర్శనమన్నారు. దుబ్బాకలో బీజేపీ మాయమాటలతో ఎల్లకాలం మోసం చేయలేరన్న సత్యాన్ని ప్రజలు గ్రహించి బీఆర్ఎస్కు అద్భుతమైన విజయాన్ని అందించారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు, పోరాటాలు, అరెస్టులకు పుట్టినిల్లు దుబ్బాక అన్నారు. ఈ ప్రాంతంలో మరోపార్టీకి స్థానం ఉండకూడదని మరోసారి బీఆర్ఎస్ సైనికులు రుజువు చేశారన్నారు. 54 వేల మెజార్టీని కట్టబెట్టి పార్టీ గౌరవాన్ని నిలబెట్టారన్నారు. కొత్త ప్రభాకర్రెడ్డి ఎన్నికల సమయంలో కత్తి పోట్లకు గురైన సందర్భంగా పోటీపై ఆయన చూపిన అనాసక్తి తనను కుంగదీసిందని, చీమకు హానీచేయని మంచి నాయకుడు, ప్రజలకు అవసరమని భావించి తానే బాధ్యత తీసుకొని ధైర్యం చెప్పి ముందుకు నడిపానన్నారు. ప్రభాకర్రెడ్డి అజాతశత్రువని కొనియాడారు. సైనికులా విజయాన్ని అందించిన నాయకులు, శ్రేణు లు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనిచ్చే ప్రసక్తి లేదు..
ప్రజలు బీఆర్ఎస్కు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుందని హరీశ్రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 412 హామీలను నెరవేర్చేదాక నిద్రపోనిచ్చే ప్రసక్తేలేదన్నారు. లోకసభ ఎన్నికల వరకు కాలయాపన చేస్తూ ఆరు గ్యారెంటీలను సాగదీస్తున్నారని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9న రైతుభరోసా అందిస్తామని, 200యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన మాటనిలుపుకోవాలన్నారు. రూ. 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటామని చెప్పిన ప్రభుత్వం ఎక్కడా అమలు చేయలేదన్నారు. కరోనాలో ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించి రైతులకు రైతుబంధును అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. ఆరు గ్యారెంటీలు కాదు.. అందులో ఉన్నవి 13 హామీలని గుర్తు చేశారు.
ధైర్యంగా ముందుకు సాగుదాం..
కార్యకర్తలు అధైర్యపడొద్దని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. పార్టీకి విజయాలు, అపజయాలు తెలుసునని, ముళ్ల బాటలు, పూలబాటలు సర్వసాధారణమన్నారు. పోరాటాలు చేసి, జైళ్లకు వెళ్లి, లాఠీ దెబ్బలు తిని తెలంగాణను సాధించుకున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు కేవలం అధికారమే తప్పా ప్రజల బాగోగులు పట్టవన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని, బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రజల్లో చర్చ పెట్టాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సమా వేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జట్పీటీసీ రవీందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చింతల జ్యోతీకృష్ణ, వైస్ చైర్మన్ పద్మయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహర్రావు, కోమటిరెడ్డి వెంకటనర్సింహరెడ్డి, మామిడి మోహన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, శివకుమార్, రొట్టె రాజమౌళి, సోలిపేట సతీశ్రెడ్డి, గుండెల్లి ఎల్లారెడ్డి, కత్తి కార్తీక, నియోజకవర్గ నాయకులు వంశీ, బానాల శ్రీనివాస్, రాంరెడ్డి, నగరం రవి, రణం శ్రీనివాస్గౌడ్, చిందం రాజ్కుమార్, పాపని సురేశ్గౌడ్, శేఖర్గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, కౌన్సిలర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకూ రుణపడి ఉంటా ;ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
తన ఘన విజయానికి కష్టపడిన ప్రతి కార్యకర్తకూ రుణపడి ఉంటానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహకారంతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలిపారు. కత్తి పోట్లకు గురై దవాఖానలో ఉన్న తనపై ఉన్న అభిమానంతో ప్రచారం నిర్వహించిన కార్యకర్తల కృషి మరిచిపోలేనిదన్నారు. సిద్దిపేట తరహాలో దుబ్బాకను అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీనిచ్చారు. దుబ్బాక రెవెన్యూ డివిజన్తోపాటు రింగురోడ్డు, నాలుగు లైన్ల రోడ్డు, పలు మండలాలకు కళాశాలలు వంటి హామీలను నెరవేరుస్తానని చెప్పారు. వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
దుబ్బాక స్ఫూర్తిని అంతటా చాటాలి
దుబ్బాక స్ఫూర్తిని అం తటా చాటాలని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్శ అన్నా రు. ఇదే స్ఫూర్తిని రాబోయే ఎన్నికల్లో చాటాలని పిలుపునిచ్చా రు. కార్యకర్తలు అధైర్యపడొద్దన్నారు. కష్టానికి ఫలి తం తప్పక లభిస్తుందన్నా రు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్, హరీశ్రావు సూచనలతో మరింత ఉత్సాహంగా ముం దుకు సాగుదామన్నారు. దుబ్బాక విజయంలో మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సమన్వమంతో పనిచేసి గొప్ప విజయాన్ని సాధించడం ఎంతో సంతోషకరమన్నారు. పార్టీకి పూర్వవైభవాన్ని అందిద్దామంటూ హరీశ్రావును మాజీ మంత్రి అని సంభోదిస్తూ రోజాశర్మ భావోధ్వేగానికి లోనయ్యారు.
-జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ