పటాన్చెరు, జూన్ 21: ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్చెరు పట్టణంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు సంజీవినిగా మారనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన రూ.134.87కోట్లతో నిర్మిస్తారు. భూమి పూజ నిర్వహించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. బుధవారం వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, వైద్యశాఖాధికారులు దవాఖాన స్థలాన్ని పరిశీలించారు. ఇదే స్థలంలో సీఎం శంకుస్థాపన చేయడంతో పాటు బహిరంగా సభలో మాట్లాడుతారు.
సభ ఏర్పాట్లపై, శంకుస్థాపన స్థలం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచనలు చేశారు. ఏరియా దవాఖానను సైతం మంత్రి పరిశీలించి పలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రికి అవగాహన కల్పించారు. సీఎంకు ఘన స్వాగతం పలుకుతామని ఎమ్మెల్యే తెలిపారు. సమీపంలో 150 అడుగుల జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గురువారం పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటిస్తారని వివరించారు. సీఎం కేసీఆర్ ముందుగా ఏసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కొల్లూర్ టౌన్షిప్ను ప్రారంభిస్తారని తెలిపారు. రూ.1432 కోట్ల ఖర్చుతో తెలంగాణ సర్కార్ నిర్మించిన ఈ డబుల్ బెడ్రూంలు 15వేల ఆరువందల కుటుంబాలకు అందజేస్తామన్నారు. రాష్ట్ర కీర్తికిరీటంలో ఈ డబుల్బెడ్రూంల టౌన్షిప్ ధగధగ మెరువబోతున్నాయన్నారు. నిరుపేదలు రూపాయి ఖర్చు లేకుండా ఈ డబుల్బెడ్రూంలు పొందనున్నారన్నారు.
అనంతరం నాగులపల్లి, వెలిమెల గ్రామల శివారులోని మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తారన్నారు. అక్కడినుంచి పటాన్చెరు పట్టణానికి వచ్చి రూ.134కోట్ల ఖర్చుతో నిర్మించే రెండువందల బెడ్ల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు సీఎం భూమి పూజ చేసి శంకుస్థాపన చేస్తారని వివరించారు. ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖాన పటాన్చెరు పారిశ్రామికవాడ ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పిస్తుందన్నారు. నూతన దవాఖాన ఏర్పాటుతో అతిపెద్ద పారిశ్రామికవాడకు ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కాలుష్య సమస్యతో సతమతమవుతున్న పటాన్చెరు వాసులకు గొప్పవరంలా ఈ దవాఖాన వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అని కొనియాడారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు గొప్పగా ఉన్నాయన్నారు. లక్షమందితో సభను గొప్పగా చేయాలని అనుకున్నా కానీ మండుతున్న ఎండల కారణంగా తక్కువ మందితో సభను నిర్వహిస్తున్నామన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాకకోసం పటాన్చెరు ప్రాంతం ఆనందంతో చూస్తున్నదన్నారు. దశాబ్దాల సూపర్ స్పెషాలిటీ దవాఖాన కలను సీఎం నిజం చేస్తున్నారని కొనియాడారు. ఖర్చుకు వెనుకాడకుండా తెలంగాణ సర్కార్ ఈ దవాఖానను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, కొలన్ బాల్రెడ్డి, నగేశ్, ఆదర్శ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.