సిద్దిపేట, జూలై 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ హయాంలో కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు, వాగులు రిజర్వాయర్లు కళకళలాడి రైతులు మంచిగా పంటలు పండించుకున్నారని.. రేవంత్ వచ్చాక కాంగ్రెస్ సర్కారు తీరుతో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు.
కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే రాజకీయ కక్షతో కాళేశ్వరం మోటర్లను కాంగ్రెస్ సర్కారు ఆన్ చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ను విమర్శిస్తే నీళ్లు రావని, మోటర్లు ఆన్చేస్తేనే రైతులకు సాగునీరు అందుతుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వర జలాలతో అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను వెంటనే నింపాలని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మోటర్లను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు స్వచ్ఛందంగా చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో హరీశ్రావు మాట్లాడారు. ఈ పాదయాత్ర బీఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమం కాదని, పూర్తిగా చిన్నకోడూరు మండల రైతుల స్వచ్ఛంద ఉద్యమమని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇతర మండలాల నుంచి ఎవరూ రాలేదని, తమ సాగునీటి హకు కోసం రైతులే ముందుకొచ్చి 16కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక అని అన్నారు.
రైతుల సహనాన్ని పరీక్షిస్తే ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్నది ప్రకృతి కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువని విమర్శించారు. ప్రభుత్వం గోదావరి నీటిని దిగువకు వదిలేస్తోందని, ఆ నీటిని ఎత్తిపోసి ఉంటే రంగనాయకసాగర్ ఇప్పటికి నిండిపోయేదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా జలాలను ఎత్తిపోసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే ఎల్లంపల్లి, ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హరీశ్రావు హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను అన్నివిధాలా మోసం చేసిందని హరీశ్రావు విమర్శించారు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, రైతుబంధు సక్రమంగా ఇవ్వలేదని, రైతుబీమాను నిలిపివేశారని, ఎరువు లు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందితే, ఇప్పుడు కోతల విద్యుత్ వస్తోందని, ధాన్యం కొనుగోలులో తరుగుపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో గోదావరి జలాలతో తెలంగాణ రూపురేఖలు మారాయని, రైతులు అప్పుల బారిన పడకుండా వ్యవసా యం చేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని, గ్రామాల్లో వలసలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష లు పకనపెట్టి రైతుల ప్రయోజనాల కోసం వెంటనే కాళేశ్వరం మోట ర్లు ప్రారంభించాలని, రంగనాయకసాగర్తో పాటు అన్ని రిజర్వాయర్లను నింపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నకోడూరు రైతులు చేపట్టిన పాదయాత్ర రైతాంగ ఆవేదనకు ప్రతీక అని పేరొం టూ ఉద్యమాన్ని సక్సెస్ చేసిన రైతులు, యువజనులు, విద్యార్థులు, కళాకారులు, ప్రజాప్రతినిధులకు హరీశ్రావు అభినందనలు తెలిపారు.