సిద్దిపేట, మార్చి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్లో జోష్ నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు సిట్టింగ్ స్థానాలను గెలిపించుకోవడంతో పాటు ఇతర పార్లమెంట్ స్థానాల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ సిద్ధ్దం చేసింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పార్టీ అభ్యర్థుల గెలుపునకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా, ఉమ్మడి మెదక్ జిల్లాలో మెజార్టీ స్థానాలను గెలుచుకొని బీఆర్ఎస్ సత్తా చాటింది. పది శాసనసభ స్థానాలకు ఏడుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అదే ఉత్సాహంతో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ స్థానాలను గెలిచి సత్తాచాటేందుకు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మెదక్ ఎంపీ స్థానం నుంచి మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్ స్థానం నుంచి గాలి అనిల్కుమార్ను అభ్యర్థులుగా బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. సిద్దిపేట జిల్లాలో విస్తరించి ఉన్న కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, భువనగిరి స్థానం నుంచి క్యామ మల్లేశ్ను పార్టీ అభ్యర్థులుగా కేసీఆర్ ప్రకటించారు. గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలోని అసెంబ్లీ స్థానాల్లో 26వ తేదీ నుంచి ఈనెల 30 వరకు సమావేశాలు నిర్వహించనున్నది. ఈ సమావేశాల్లో క్యాడర్కు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు దిశానిర్దేశం చేస్తారు.
ఇదే తరహాలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని శాసనసభ స్థానాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది శాసనసభ స్థానాల్లో పార్టీ సమావేశాలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత, పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన అనంతరం మరోసారి పార్టీ సమావేశాలు నిర్వహించి అన్ని స్థానాలు కైవసం చేసుకోవడానికి వ్యూహం రచిస్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అందరినీ కలుస్తున్నారు. అందరికన్నా ముందుగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్కుమార్ను ప్రకటించడంతో ఆయన అన్ని మండలాలను తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇటీవల హుస్నాబాద్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పార్టీ గెలుపునకు కృషిచేయాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేశ్ను పార్టీ ప్రకటించడంతో త్వరలోనే ఇక్కడ పార్టీ కార్యాచరణ సిద్ధ్దం చేయనున్నారు. అన్ని స్థానాల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభలు నిర్వహించేలా రూట్మ్యాప్ రెడీ చేస్తున్నారు. అన్ని మండల కేంద్రాలతో పాటు పెద్ద గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించి సత్తాచాచేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
మెదక్, కరీంనగర్, భువనగిరి స్థానాల్లో ఎవరిని బరిలో నిలపాలన్న దానిపై కాంగ్రెస్ సార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. పార్లమెంట్జహీరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్ షెట్కార్ను మాత్రమే ప్రకటించింది. పార్టీలో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకొని తమ పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయి ఢిల్లీ కేంద్రంగా తమ మద్దతు దారులకు అనుకూలంగా లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఎవరిని నిలపాలో తేల్చుకోలేక పోతున్నది. మెదక్ పార్లమెంట్ స్థానానికి రోజుకో పేరు తెరపైకి వస్తున్నది. ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది. ఈ స్థానంలో బీఆర్ఎస్ను ఓడించడం అంత సులువు కాదని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. దీంతో అభ్యర్థుల వేటలో పడింది. మెదక్ పార్లమెంట్ స్థానానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మలా జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నీలం మధుతో పాటు శ్రావణ్కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరికి తోడు ఓ పారిశ్రామిక వేత్త పేరుతో పాటు ఇతర పార్టీలోని ఓ నాయకుడిని పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ను ఢీకొట్టడం కాంగ్రెస్ పార్టీకి అంత సులువు కాదని సీఎం రేవంత్రెడ్డితో సహా ఇతర నేతలకు తెలుసు. అందుకే బీఆర్ఎస్ నేతలను తమవైపు తిప్పుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. మెదక్ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో ఒక్క మెదక్ తప్ప అన్నిచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో వణుకు పుడుతోంది. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా ఇంత వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక్కడ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి పేరుతో పాటు మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరి స్థానం నుంచి కోమటిరెడ్డి ఫ్యామిలి నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నప్పటికీ, ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. దీంతో వారు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాగా, బీజేపీ అభ్యర్థులపై సొంత క్యాడర్ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.