సిటీబ్యూరో, జనవరి 19(నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ గ్రేట ర్ జోన్ అధికారులు ఆదాయం వచ్చే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు చాలా మంది ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కోకాపేట్కు ప్రయాణం చేసే ఐటీ, ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. ఈ క్ర మంలో ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నగరంలో పలు ప్రాంతాల నుంచి కోకాపేట్ వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉప్పల్, మేడ్చల్, దిల్సుఖ్నగర్ వంటి పలు ప్రాం తాల నుంచి కోకాపేట్ వరకు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎల్బీనగర్, మియాపూర్, ఉప్పల్ నాగోల్ నుంచి దుర్గం చెరువు వరకు మెట్రో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు దాదాపు 60 శాతానికి పైగా మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఆయా మార్గాల్లో తిరిగే ఆర్టీసీ బస్సులకు కొం త వరకు ఆక్యుపెన్సీ తగ్గినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఆదాయ మార్గాలను రెట్టింపు చేసుకోవడానికి ప్రయాణ సౌకర్యం లేని కొత్త మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నడిపించడంపై దృష్టి సారించారు. అన్ని మెట్రో స్టేషన్లకు కనెక్టివిటీని పెంచుతూనే కొత్త మార్గాల్లో సిటీ బస్సులను నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆర్టీసీ ఇప్పటికే సికింద్రాబాద్, కూకట్పల్లి నుంచి హైటెక్సిటీ, వేవ్రాక్ వరకు ఐటీ ఉద్యోగుల కోసం సిటీ బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా మార్గాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఇదే స్ఫూర్తితో నగరం నలువైపుల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ గ్రేటర్ అధికారులు చెబుతున్నారు. అలాగే త్వరలోనే నగరానికి 300 వరకు విద్యుత్ బస్సులు రానున్నాయని తెలిపారు. వాటిని కూడా ఆదాయం పుష్కలంగా ఉండే మార్గాల్లో తిప్పే ప్రయత్నం చేస్తున్నామని, అందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం అవుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో నగర శివార్లలో ఉన్న పలు ఇంజినీరింగ్ కాలేజీల వరకు బస్సు కనెక్టివిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.