రామాయంపేట, జూలై 16 : రామాయంపేట మండలంలో లక్ష్మాపూర్ క్రాస్రోడ్డు నుంచి మెదక్ జిల్లా శివారు దంతెపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులను ప్రారంభిస్తామని జిల్లా పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని లక్ష్మాపూర్ నుంచి మెదక్ జిల్లా శివారు వరకు 11.7 కిలోమీటర్ల రోడ్డును పంచాయతీరాజ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైనందున పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2కోట్ల 76 లక్షలు మంజూరు చేసిందన్నారు. రోడ్డు పనుల ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మొత్తం 11.7 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రూ.2కోట్ల 51లక్షలు, 3 కల్వర్టుల నిర్మాణాలకు రూ.25లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రామాయంపేట మండలంలోని దంతెపల్లి, కాట్రియాల, బిల్యా, తీన్నెంబ ర్, భిక్షపతితండాల్లో బీటీరోడ్ల మరమ్మతులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రతిపాదనలు పంపించారని తెలిపారు. నిధులు మంజూరు
కాగానే, వాటి పనులను త్వరితగతిన ప్రారంభిస్తామన్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి రుణపడి ఉంటామని ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు మైలారం శాము లు, బుజ్జి, సురేశ్, దయాలక్ష్మి, భాగ్యమ్మ, నాగులు, దేవేందర్ పేర్కొన్నారు. ఈఈ సత్యనారాయణరెడ్డి వెంట డీఈ పాండురంగారెడ్డి, రామాయంపేట ఏఈ విజయకుమార్ తదితరులు ఉన్నారు.