కోహెడ, ఫిబ్రవరి 9: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల సమీపంలోని గుట్టలో వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి (సింగరాయ) జాతర శుక్రవారం ఘనంగా జరిగింది. జాతరకు భీమండి, పూణె, సోలాపూర్ తదితర పట్టాణాల నుంచే కాకుండా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ , వరంగల్ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే జాతరకు జనం పోటెత్తారు. కొండల మధ్య పారుతున్న మోయతుమ్మెదవాగులో భక్తులు స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గాజుల బండపై వెలిసిన దుకాణాల్లో మిఠాయిలు, బొంగులు కొనుగోలు చేసి సాయంత్రం ఆరు గంటల వరకు ఆనందంగా గడిపారు.
భక్తులు సహపంక్తి భోజనాలు చేసి చెట్లకింద సేదతీరారు. ఎంపీపీ కొక్కుల కీర్తి -సురేశ్, ఏఎంసీ చైర్పర్సన్ తిప్పారపు జ్యోతి-శ్రీకాంత్ దంపతులు స్వామి వారిని దర్శంచుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కోహెడకు చెందిన పేర్యాల సుకుమార్రావు, మైసంపల్లికి చెందిన పోలవేని కుమారస్వామి భక్తులకు మజ్జిక, నీళ్ల ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.