తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ వేడుకను ఘనంగా జరుపుకొనేందుకు పల్లెలు, పట్టణాలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నేడు మెదక్లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, సంగారెడ్డిలో మంత్రి మహమూద్అలీ జెండావిష్కరణలు చేయనున్నారు. కలెక్టర్లు శరత్కుమార్, రాజర్షి షా గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక రాష్ట్రంలో సాధించిన ప్రగతిని వాడవాడలా తెలియజేసేలా నేటి నుంచి ఈనెల 22 వ తేదీ వరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించనున్నారు. సభలు, ర్యాలీలు, సహపంక్తి భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కరపత్రాలు, ఫ్లెక్సీలతో ఊరూరా రోజుకో కార్యక్రమం చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆదేశాలు జారీ చేశారు.
-సంగారెడ్డి/మెదక్, (నమస్తే తెలంగాణ) జూన్ 1
సంగారెడ్డి జూన్ 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి ఈనెల 22వ తేదీ వరకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, హాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు మంత్రి హరీశ్రావు అధ్యక్షతన జిల్లా స్థాయి ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్ శరత్, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు సభ్యులుగా ఉన్నారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లాలోని కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.5.06 కోట్ల నిధులు కేటాయించింది. ఉత్సవాలు సజావుగా సాగేలా కలెక్టర్ శరత్ పర్యవేక్షించనున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురవేసి, ప్రసంగిస్తారు.
7న వేడుకలకు మంత్రి హరీశ్రావు రాక
ఈనెల 7న జరిగే సాగునీటి సంబురాల్లో భాగంగా మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మునిపల్లి మండలంలోని చిన్నచెల్మడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించనున్నారు. రైతులతో నిర్వహించే సమావేశంలో మంత్రి పాల్గొననున్నారు.
అంబరాన్నంటేలా సంబురాలు: కలెక్టర్ శరత్
సంగారెడ్డి జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శరత్ తెలిపారు. కలెక్టరేట్లో దశాబ్ది ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు జిల్లాలో దశాబ్ది వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
మెదక్ జిల్లాలో..
మెదక్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేండ్లు పూర్తై 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ఈ ఉత్సవాలు 21 రోజుల పాటు నిర్వహించనున్నారు. రోజుకో శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. గ్రామీణాభివృద్ధి, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయం, సంక్షేమం, విద్యుత్, మత్య్సశాఖ తదితర విభాగాల సహకారంతో కార్యక్రమాలు నడిపిస్తారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం
రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తరువాత అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తారు. అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిపై అవగాహన కల్పిస్తారు. దేశంలో ఎకడా లేనివిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తారు. విద్య, వైద్యంలో వచ్చిన మార్పులు తెలుపుతారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత చేప పిల్లల పంపిణీ, దళితబంధు, గొర్రెల పంపిణీ మొదలగు పథకాలపై పూర్తి వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. పల్లె, పట్టణ ప్రగతి కింద మంజూరైన అభివృద్ధి నిధులపై సభలు, ర్యాలీలు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, సాంసృతిక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ప్రగతిని వివరిస్తారు. గ్రామగ్రామాన సభలు నిర్వహించి సహ పంక్తి భోజనాలు ఏర్పాటుచేస్తారు.
ఉత్సవాలకు మెదక్ కలెక్టరేట్ ముస్తాబు
దశాబ్ది ఉత్సవాలకు మెదక్ కలెక్టరేట్ ముస్తాబైంది. రాష్ట్రావతరణ వేడుకల ఏర్పాట్లు, వేదిక, వివిధ శాఖలు ఏర్పాటు చేయబోయే స్టాళ్లు, ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ ప్రాంతాలను ఇన్చార్జి ఎస్పీ సింధు శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిషరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు.