మెదక్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం కస్టమ్ మిల్లింగ్ రైస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేదు. యాసంగి, వానకాలం సీజన్లలో 6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 160 రైస్ మిల్లులకు అందజేయగా, 4.63లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలని టార్గెట్ విధించారు. కాగా, ఇప్పటివరకు 1,81,416 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. పెండింగ్లో ఉన్న 2.80లక్షల మెట్రిక్ టన్నులను ఈ నెల 31లోగా అందజేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మెదక్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సీఎంఆర్ రైస్ విషయంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద పౌర సరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన బియ్యంపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువవడంతో సర్కారుకు టోకరా పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి బియ్యం రూపంలో పౌర సరఫరాల శాఖకు నిర్దేశించిన గడువులోగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గడువు ముగిసినప్పటికీ జిల్లా వ్యాప్తంగా రెండేండ్లుగా కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 2.80 లక్షల టన్నులను మిల్లర్లు తిరిగి ఇవ్వాల్సి ఉంది.
2022-23 వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి సీఎంఆర్ కోసం మిల్లర్లకు అందజేశారు. వానకాలం సీజన్లో 3.86 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగి సీజన్లో 2.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 160 రైస్ మిల్లులకు కేటాయించారు. 2022-23 వానకాలం సీజన్లో 3.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు సరఫరా చేయగా, మిల్లర్లు 2.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్ సప్లయ్ శాఖకు అందజేయాల్సి ఉన్నప్పటికీ 1.59 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా లక్ష మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. యాసంగి సీజన్లో 2.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించగా, మిల్లర్లు 2.3లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 22,416 మెట్రిక్ టన్నులను మాత్రమే ఇచ్చారు. ఇంకా 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉంది. మొత్తంగా గతేడాది సంబంధించి 2.80లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం ఇచ్చిన 15 రోజుల్లోగా బియ్యం తిరిగి ఇవ్వాలని నిబంధనలున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి.
మెదక్ జిల్లాలోని 68 రైస్మిల్లులకు సీఎంఆర్ కోటా నిలిపివేయగా, ఆరు రైస్మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టారు. నర్సాపూర్లోని శ్రీపాద రైస్ ఇండ్రస్టీస్, పెద్దచింతకుంటలోని శ్రీ వెంకటేశ్వర రైస్మిల్, శివ్వంపేటలోని శ్రీ లక్ష్మీనర్సింహా రైస్ మిల్, నర్సాపూర్లోని శివసాయి రైస్మిల్లు, పాపన్నపేటలోని భార్గవ ఇండ్రస్టీస్, మాసాయిపేటలోని చైతన్య రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం ఇచ్చిన 15 రోజుల్లోగా సీఎంఆర్ రైస్ తిరిగి ఇవ్వాలి. రైస్ ఇవ్వడంలో రైస్ మిల్లర్లు జాప్యం చేస్తున్న మాట వాస్తవమే. జిల్లాలో ఇంకా 2.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. డిసెంబర్ 31లోగా పెండింగ్ బియ్యాన్ని ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించాం. ఇప్పటికే 68 రైస్ మిల్లులకు కోటాను నిలిపివేశాం. ఆరు రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టాం.