అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలబడుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం సేకరణ, మిల్లుల్లో పరిస్థితులపై బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. రైస్ మిల్లుల్లో ధాన్యం దించుకునేందుక స్థలం సరిపోకపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, మే 24
మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, మే 24: ధాన్యం కొనుగోళ్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన మంత్రి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, పౌర సరఫరాల కమిషనర్తో కలిసి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు ధాన్యం తరలింపుపై ఆరా తీశారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఈ సీజన్లో ముందస్తుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు.
గత సంవత్సరం కంటే అధికంగా 450 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. అకాల, వడగండ్ల వర్షాలతో ధాన్యం రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు ఊరట అందిస్తున్నదని పేర్కొన్నారు. 21 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామన్నారు. గతేడాది 28.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈ ఏడాది ఇప్పటికే 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సహకార సంఘాల సహకారంతోనే పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు సాధ్యమవుతుందని, అందుకు సహకరించిన వారందరినీ మంత్రి అభినందించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 67,230 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్న సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 67,230 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రికి వివరించారు. ఇప్పటివరకు 13,730 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రూ.43.82 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో డీఎస్వో వనజాత, డీఎం సుగుణబాయి తదితరులు పాల్గొన్నారు.
10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించాం
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మంత్రి గంగుల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మెదక్ కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్లో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మూతపడిన అల్యూమినియం ఫ్యాక్టరీ, ఖండసారి షుగర్ ఫ్యాక్టరీల్లో 31 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అన్లోడ్ చేసి భద్రపరిచామన్నారు. గత సీజన్లో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం గద్వాల జిల్లాకు తరలించగా, ప్రస్తుతం ఇకడే తీసుకుంటుండంతో స్థలాభావ సమస్య ఏర్పడుతున్నదన్నారు. సంగారెడ్డి జిల్లాకు 10 వేల మెట్రిక్ టన్నులు తరలించేందుకు అనుమతి వచ్చినదని, మరో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా తరలించి గోదాముల్లో భద్రపర్చేందుకు అనుమతించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా అదనపు కలెక్టర్ పర్యవేక్షిస్తున్నాని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరాం, జిల్లా సహకార అధికారి కరుణ తదితరులు పాల్గొన్నారు.