ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. రైతులు సైతం తాము పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ కేంద్రాల్లో విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ గ్రేడ్ క్వింటాల్కు రూ.2060, బీ గ్రేడ్కు రూ.2040 చెల్లిస్తుండగా, చివరి గింజ వరకూ కొంటామని ఎవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. మెదక్ జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 3,30,500 మెట్రిక్ టన్నులను అధికారులు సేకరించారు. 61,429 మంది రైతుల ఖాతాల్లో రూ. 341కోట్లు జమచేశారు. సంగారెడ్డి జిల్లాలో 3.51 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా, 227 సెంటర్ల ద్వారా 1,48,661 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి, రూ.178.05 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన గన్నీబ్యాగులు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు చేరవేస్తున్నారు.
– సంగారెడ్డి/ మెదక్, (నమస్తే తెలంగాణ) నవంబర్ 28
ధాన్యపు రాశులు ఖాళీ అవుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధనాధన్ వడ్ల కాంటా జరుగుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఏ-గ్రేడ్ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చొప్పున ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 227 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.48 లక్షల టన్నులు, మెదక్ జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,30,500 మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించారు. ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
వానకాలంలో సాగు చేసిన రైతులు ధాన్యం అమ్మకంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో ఈ సీజన్కు 2 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతులు తమ అవసరాల కోసం ఉంచుకునే ధాన్యంతో పాటు స్థానికంగా, మార్కెట్లో వ్యాపారులకు విక్రయించే ధాన్యం మినహా 5 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలిస్తారని భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుత సీజన్లో ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.2,060 చొప్పున, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,040 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికే మొగ్గుచూపుతున్నారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద తూకం ప్రారంభంకావడంతో జిల్లాలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 61,429 మంది రైతుల నుంచి 3 లక్షల 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రూ.341 కోట్లు రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని తెలిపారు. ధాన్యం సేకరణలో సొసైటీలు అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తేనే లారీలకు సంబంధించిన వే బిల్లులు, రసీదులు అందిస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులు, ధాన్యం బస్తాలు తరలివస్తున్న లారీ నంబర్తో పాటు డ్రైవర్ వివరాలు, రైస్ మిల్లుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో రసీదులు ఆన్లైన్లోనే వస్తున్నాయి.
ధాన్యం తూకం వేయడానికి స్థానికంగా హమాలీల కొరత తీవ్రంగా ఉంది. మూడేండ్లుగా ఈ సమస్య వేధిస్తున్నది. దీంతో బీహార్కు చెందిన కూలీలపై ఆధారపడుతున్నారు. ఆ రాష్ర్టానికి చెందిన యువకులు ముందుకు రావడంతో హమాలీల కొరత తీరింది. దాదాపు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో బీహార్కు చెందిన కూలీలే హమాలీ పనులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుందని బీహార్ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో రెండు సీజన్లలో పనులు చేస్తున్నామని, రెండు నెలల పాటు ఇక్కడే ఉంటూ ఉపాధి పొందుతున్నామని పేర్కొంటున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయి. వానకాలంలో రైతులు 1,39,270 ఎకరాల్లో వరి సాగు చేశారు. 3.90 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 3.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకోగా, ఇందుకోసం జిల్లాలో 227 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ నిర్ణయించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 102, పీఏసీఎస్ 103, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 22 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం సేకరణ కోసం 87.75 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, జిల్లాలో 62.73 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగతా 25 లక్షల గన్నీ బ్యాగులను కొనుగోలు చేయనున్నారు. ధాన్యం కొనుగోలుకు వీలుగా 50 లక్షల వరకు గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 27,675 మంది రైతుల నుంచి 1,48,661 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రతిరోజు 10 నుంచి 15వేల మెట్రిక్ టన్నులధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 62,240 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. పీఏసీఎస్, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా 86,421టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన 1,45,489 టన్నుల ధాన్యాన్ని మిల్లులకు చేరవేశారు. జిల్లాలో ఇప్పటి వరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.306.24 కోట్లు కాగా, ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.178.05 కోట్లు జమ చేశారు.
జిల్లాలో ఇప్పటి వరకు 61,429 మంది రైతుల నుంచి 3 లక్షల 30వేల 500 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.341 కోట్లు జమ చేశాం. 75 శాతం ధాన్యం కొనుగోళ్లు చేశాం. వాన కాలంలో రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తూ జిల్లా అధికారులు, రైస్ మిల్లర్ల యజమానులే, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లకు సూచిస్తున్నాం.
– రమేశ్, అదనపు కలెక్టర్, మెదక్