సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సీఎం ఆదేశించారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెట్లో క్వాలిఫై అయిన వారు టీఆర్టీకి పోటీపడేందుకు అర్హులు. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా నియామకాలు చేపడుతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
సిద్దిపేట, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. త్వరలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేయనున్నది. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతివ్వడంతో ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు విడుదల కానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 571 ఖాళీలను గుర్తించారు. వీటిలో సిద్దిపేటలో ఎస్ఏ 60, ఎస్జీటీ 49, ఎల్పీ 24, పీఈటీ 08 మొత్తం 141 పోస్టులు, మెదక్ల్లో ఎస్ఏ 70, ఎస్జీటీ 48, ఎల్పీ 28, పీఈటీ 01 మొత్తం 147 పోస్టులు, సంగారెడ్డిలో ఎస్ఏ 80, ఎస్జీటీ 174, ఎల్పీ 24, పీఈటీ 05 మొత్తం 283 పోస్టులు డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
రెండు,మూడు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున వివిధ విభాగాల్లో నియామకాలను చేపట్టింది. పోలీస్శాఖలో పెద్దఎత్తున కానిస్టేబుల్, ఎస్సై తదితర పోస్టులను భర్తీ చేసింది. టీఎస్పీఎస్ నుంచి నోటిఫికేషన్లను విడుదల చేసి నియామకాలను చేపట్టింది. సీఎం కేసీఆర్ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తుండడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు అన్ని నియామక పరీక్షల్లో పోటీపడేందుకు వీలుగా తగిన వ్యవధి ఇస్తూ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష నియామకాల్లో పోలీస్శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని పెంచిన విషయం తెలిసిందే. దీంతో వేలాది మంది నిరుద్యోగులకు వరమైంది.