సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 8 : రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆదర్శవంతమైన జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలో నిర్మించుకోబోతున్నామని, సిద్దిపేట జిల్లా ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండల ఎల్లుపల్లి గ్రామ శివారులో రూ.4 కోట్లతో నిర్మించే జిల్లా సమాఖ్య భవనానికి, రూ.50 లక్షలతో నిర్మించే మహిళా ప్రాంగణం భవనానికి, రూ.కోటితో నిర్మించే వృద్ధాశ్రమ భవనాలకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిధిలోని మిట్టపల్లిలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్తో కలిసి పాల్గొని లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గతంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం ఉన్నప్పుడు మహిళా సమాఖ్య సమావేశాలు జరిగితే చాలా ఇబ్బందులు పడేవారని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్ కావడం వల్ల సిద్దిపేట జిల్లా ఏర్పడి మహిళా సమాఖ్య భవనం ఇక్కడే నిర్మించుకుంటున్నామన్నారు.
ఒకటే ప్రాంగణంలో రూ.6 కోట్లతో జిల్లా సమాఖ్య భవనం, మహిళా ప్రాంగణం, వృద్ధ్దాశ్రమ భవనాలకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఇల్లు కట్టాలంటే ఎన్నో కష్టాలు, ఎంతో ఆర్థిక భారం ఉంటుందని, కానీ రూపాయి భారం పడకుండా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. త్వరలోనే మిట్టపల్లి గ్రామానికి మరి కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మరో మూడు నెలల్లో మిట్టపల్లికి రైల్వే లైన్ కూడా వస్తుందన్నారు. గతంలో దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాల్లో నీళ్ల కోసం ఎంత గోస పడ్డామో మనందరం చూశామని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటింటికీ నల్లా నీళ్లు తెచ్చి సీఎం కేసీఆర్ ఆడబిడ్డల కష్టాలు తీర్చారన్నారు. కల్యాణలక్ష్మి పథకం తీసుకురావడం ద్వారా బాల్య వివాహాలు తగ్గిపోవడంతో పాటు ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఒక గొప్ప మార్పు తెచ్చారన్నారు.
సకల సౌకర్యాలతో ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు కొనసాగుతున్నాయన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు శిశువుకు తల్లిపాలు తాగిపించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అత్యాధునిక సౌకర్యాలతో దవాఖానలు నిర్మించామన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో కంటే ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల్లోనే డెలివరీలు అధికంగా జరుగుతున్నాయన్నారు. బీడీ కార్మికులకు కూడా ఆసరా పింఛన్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. ఆయిల్పామ్ సాగు వల్ల అధిక లాభాలు ఉన్నాయని, రైతులు ఆ దిశగా ఆలోచించాలన్నారు. రూ.300 కోట్లతో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు ఇండ్ల పట్టాలతో పాటు నూతన వస్ర్తాలు అందజేశారు.
వడ్ల విషయంలో సీన్ రివర్స్
ధాన్యం విషయంలో తెలంగాణ రాష్ట్రం గొప్ప విజయం సాధించిందని, పొరుగు దేశాలతో పాటు భారతదేశంలోని చాలా రాష్ర్టాల్లో వరదలు, ఇతరత్రా కారణాల వల్ల వరి సాగు తగ్గిందని మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పుణ్యమా అని.. అధిక ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు.గతంలో వడ్లు కొనమంటే బీజేపీ ప్రభుత్వం మొండికేసిందని, కానీ, ఇప్పుడు తెలంగాణను బతిలాడే పరిస్థితి వచ్చిందని(సీన్ రివర్స్) మంత్రి అన్నారు.
మహిళా సమాఖ్య భవనాలు నిర్మిస్తాం
జిల్లాలో ఉన్న 499 గ్రామపంచాయతీల్లో మహిళా సమాఖ్య భవనాలు నిర్మిస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఏ గ్రామంలో మహిళా సమాఖ్య భవనం లేదో.. ఆ జాబితాను జిల్లా అధికారికి ఇవ్వాలని సూచించారు. త్వరలోనే రుతుప్రేమ కార్యక్రమంపై మహిళా సమాఖ్య లీడర్లకు అవగాహన కల్పిస్తామన్నా రు. అనంతరం జ్లిలాలోని 1273 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.108 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను, రూ.72 లక్షల ట్రాక్టర్లు, రూ.4 లక్షల 50 వేల రూపాయల ట్రాలీని మహిళా సంఘాలకు మంత్రి అందజేశారు. కార్యక్రమంలో డీపీవో దేవకీదేవి, డీఆర్డీవో గోపాల్రావు, ఎంపీపీ సవితా ప్రవీణ్రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మిట్టపల్లి సర్పంచ్ లక్ష్మి, ఎల్లుపల్లి సర్పంచ్ జయశ్రీ రమేశ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వాతి, జిల్లాలోని మహిళా సమాఖ్య లీడర్లు తదితరులు పాల్గొన్నారు.