చేర్యాల, జనవరి 9: చేర్యాల పట్టణంలో రూ.9కోట్ల వ్యయంతో ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణానికి నేడు మంత్రి తన్నీరు హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు. చేర్యాలలో 30పడకల దవాఖాన నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. దశాబ్దాల క్రితం నిర్మించిన దవాఖానలో ప్రజలకు సరిపడా వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభ్యర్థన మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చేర్యాలలో దవాఖాన నిర్మాణానికి నిధులు మం జూరు చేశారు.
30 పడకల వసతులతో గ్రౌండ్, ఫస్ట్ఫ్లోర్తో ఆధునిక వసతులతో దవాఖాన భవన నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్థలం అవసరం ఉండగా, పాత దవాఖాన ఉన్న ప్రదేశం సరిపోకపోవడంతో మున్సిపాలటీ పరిధిలోని 5వ వార్డు వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక భాగంలోని పాలశీతలీకరణ కేంద్రం పక్కనే నూతనంగా దవాఖాన నిర్మాణానికి సంబంధితశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్ కోసం అనువైన స్థలం కోసం పట్టణానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు వివిధ ప్రదేశాలను పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బీడీ కాలనీకి వెళ్లే దారిలో అనువైన స్థలం గుర్తించి అక్కడే దవాఖాన నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ దవాఖానను ఆధునిక వసతులతో నిర్మాణానికి చర్యలు తీసుకోవడంతో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్న పనులు మంత్రి
మంత్రి హరీశ్రావు ఎనిమిది నెలల క్రితం చేర్యాలలో పర్యటించిన సందర్భంగా ప్రభుత్వ దవాఖానను సందర్శించడంతోపాటు వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దవాఖానలో వసతులు, వైద్యులు, సిబ్బంది, మందులు తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు. చేర్యాలలో కొత్త దవాఖాన నిర్మాణానికి నిధులు సైతం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ఇచ్చిన మాటకు అనుగుణంగా నిధులు మంజూరు చేయడంతో మంత్రి హరీశ్రావు చేర్యాలలో పర్యటించి కొత్త దవాఖాన పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు.
నేడు మంత్రి హరీశ్రావు పర్యటన
చేర్యాల, ధూళిమిట్ట మండలాల్లో మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. మంత్రి మొదటగా దివంగత జడ్పీటీసీ శెట్టె మల్లేశం స్వగ్రామానికి వెళ్లి అక్కడ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం దవాఖాన పనులకు భూమి పూజ నిర్వహించి అక్కడ నుంచి పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం ధూళిమిట్ట మం డల కేంద్రానికి వెళ్లి వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు.
మంత్రి పర్యటన విజయవంతం చేయాలి
మంత్రి పర్యటనను కార్యకర్తలు విజయవం తం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీ శ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య కోరారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మంత్రి చేర్యాల ప్రాంతాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కృషి, మంత్రి శ్రద్ధతో చేర్యాల అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటనలకు ప్రజాప్రతినిధులు, నాయకులు తరలిరావాలని కోరారు.