తల్లీబిడ్డల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనికోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కృషిచేస్తున్నది. కేవలం పెద్ద నగరాలు, జిల్లాకేంద్రాలకే పరిమితమైన గర్భిణి, పిల్లల వైద్యసేవలు.. రాష్ట్ర ప్రభుత్వం కృషితో గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్లో సైతం మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించేందుకు సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే అధికారులు ప్రస్తుతం ఉన్న దవాఖాన ఆవరణలో స్థలాన్ని గుర్తించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
హుస్నాబాద్, ఆగస్టు 2: హుస్నాబాద్లో ప్రస్తుతం వైద్య విధాన పరిషత్ ద్వారా 50పడకల దవాఖాన విజయవంతంగా నడుస్తోంది. ఇటీవల సిజేరియన్తో పాటు ఇతర జనరల్ ఆపరేషన్లు నిర్వహిస్తుండడంతో దవాఖానకు రోగులు క్యూ కడుతున్నారు. దీంతో పాటు ఈ ప్రాంత ప్రజల సౌకర్యం కోసం మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తూ వైద్యారోగ్య శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల మంత్రి తన్నీరు హరీశ్రావు దవాఖానలో సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సతీశ్కుమార్ విజ్ఞప్తి మేరకు మంత్రి స్పందించి ఈ దవాఖాన భవనాన్ని మంజూరు చేశారు. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భవన నిర్మాణానికి రూ.7.50కోట్లు మంజూరు…
హుస్నాబాద్లోని సర్కారు దవాఖాన ఆవరణలో మాతాశిశు సంరక్షణ కేంద్రం భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.7.50కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ప్రస్తుత దవాఖానలో నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్ పేరుతో ఉన్న పాత భవనం స్థానంలో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. 50పడకల సామర్థ్యంతో దవాఖాన నిర్మాణం జరుగనున్నది. ఇందులో సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన వైద్యసేవలు అందించనున్నారు. గర్భిణలు, పిల్లల వైద్యం కోసం హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట జిల్లాకేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. నియోజకవర్గ కేంద్రంలోనే అన్ని వసతులు ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నందున గ్రామీణ ప్రాంత ప్రజలకు దూరం, ఆర్థిక భారం తగ్గనుంది. మారుమూల గిరిజన తండాల ప్రజలతో పాటు చుట్టుపక్కల మండలాలు, గ్రామాల ప్రజలకు ఈ దవాఖాన ఉపయోగపడనున్నది.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిన సీఎం కేసీఆర్, ఉత్తర్వులు ఇప్పించిన మంత్రి తన్నీరు హరీశ్రావుకు కృతజ్ఞతలు. హుస్నాబాద్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటైతే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. చుట్టూ 40కి.మీ.ల వరకు దవాఖాన లేదు. దీంతో గ్రామీణ ప్రాంత తల్లీబిడ్డలు దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడేవారు. రూ.7.50 కోట్లతో 50 పడకలతో మాతాశిశు కేంద్ర భవనం మంజూరు కావడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఉన్న దవాఖానలో దాదాపు అన్ని రకాల వైద్యసేవలు అందుతున్నాయి. కొత్త దవాఖాన పూర్తయితే హుస్నాబాద్ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సర్కారు వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్
మంత్రి, ఎమ్మెల్యేల కృషితోనే
వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ కృషితోనే హుస్నాబాద్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతున్నది. సర్కారు వైద్యం అందు బాటులో లేక ప్రజలు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ ఇబ్బం దుల నుంచి ప్రజలను దూరం చేసేందుకే ఎమ్మెల్యే సతీశ్కుమార్ కోరిన వెంటనే మంత్రి స్పందించి ఉత్తర్వులు జారీచేశారు. మంత్రి, ఎమ్మెల్యేలకు ప్రజలు రుణపడి ఉంటారు.
– ఆకుల రజితావెంకట్, మున్సిపల్ చైర్పర్సన్,హుస్నాబాద్