గజ్వేల్లో ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండే విధంగా సీఎం కేసీఆర్ చొరవతో సమీకృత కార్యాలయ భవనం అందుబాటులోకి వచ్చింది. హౌసింగ్బోర్డు కాలనీలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.42.50కోట్లతో రెండస్తుల భవనం నిర్మించగా అందులో 45 ప్రభుత్వ శాఖల అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారు. ఏ బ్లాక్లో తపాలాకార్యాలయం, డైనింగ్ హాల్, మండల సమావేశ మందిరం, బీ బ్లాక్ రెండో అంతస్తులో ఇరిగేషన్ సీఈ కార్యాలయానికి కేటాయించగా మొదటి అంతస్తులో డివిజన్ స్థాయి కార్యాలయాల్లో పంచాయతీరాజ్ డీఈ, ఆర్అండ్బీ ఈఈ, డీఈ, రెవెన్యూ భూసేకరణ కార్యాలయం, ఎస్సీ, బీసీ సంక్షేమాధికారుల కార్యాలయాలు, డీఎల్పీవో ఇక గ్రౌండ్ ఫ్లోర్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే రెవెన్యూ విభాగంలో ఆర్డీవో, తహసీల్దార్, వ్యవసాయం, మాతాశిశు సంక్షేమం, లేబర్, అటవీ, ఎంపీడీవో, ఎస్టీవో కార్యాలయాలు ఉన్నాయి. సీ బ్లాక్లో గడా కార్యాలయం, జిల్లా అధికారుల సమావేశాల కోసం ప్రత్యేకంగా హాల్ నిర్మించారు. గతంలో అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలన్నీ నేడు ఐవోసీలోనే ఉన్నాయి.
గజ్వేల్, సెప్టెంబర్ 23: ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటే నిత్యం మండల కేంద్రాలకు వచ్చే వారు పనులను సులభంగా పూర్తి చేసుకొనే వీలుంటుంది. సమైక్యపాలనలోమండల కేంద్రంలో ఉన్న కార్యాలయాల్లో కొన్ని శిథిలావస్థలో ఉంటే మరిన్ని అద్దె భవనాల్లో కొనసాగేవి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత గజ్వేల్ నుంచే కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడంతో ఇక్కడ రూపురేఖలు మారిపోయాయి.
జిల్లాల పునర్విభజనలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రం కావడంతో గజ్వేల్ రెవెన్యూ డివిజన్గా మారింది. దీంతో సిద్దిపేటలో ఉన్న డివిజన్ స్థాయి కార్యాలయాలు గజ్వేల్లో ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు పాలనాపరంగా ఇబ్బందులు దూరమయ్యాయి. ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో గజ్వేల్లోనే ప్రభుత్వం సీఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్ రాకతో గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన సమీకృత కార్యాలయ భవనం(ఐవోసీ)లోకి అధికారిక కార్యాలయాలుతరలించారు.
కొత్తగా ఏర్పాటైన కార్యాలయాలు
గజ్వేల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో కొత్తగా ఆర్డీవో, ఆర్అండ్బీ ఈఈ, ఇరిగేషన్ ఎస్ఈ, సీఈ, అటవీ రేంజ్ అధికారి కార్యాలయం, డీఎల్పీవో, ఉపాధి హామీ ఏపీడీ, ఏటీవో, ఏసీపీ, ఎంవీఐ కార్యాలయాలు ఏర్పాటు కాగా మరిన్ని డివిజన్ స్థాయిలో కార్యాలయాలు విడిపోగా ములుగు, వర్గల్ మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేశారు. గజ్వేల్ మండలం కోమటిబండ మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద ప్రత్యేకంగా మిషన్ భగీరథ ఈఈ, డీఈ, ఏఈ, సిబ్బంది కోసం కార్యాలయ భవనం నిర్మించారు.
మండల కేంద్రాల్లో ఐఎంఐసీ భవనాలు...
గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఐఎంవోసీ (ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ కాంప్లెక్స్) భవనాల నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రభుత్వ నిధులతో మండల కేంద్రాల్లో ఐఎంవోసీ భవనాల పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఒక్కో ఐఎంవోసీ భవనాన్ని రూ.5కోట్లతో మర్కూక్, జగదేవ్పూర్, ములుగు, వర్గల్, కొండపాక, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో నిర్మిస్తున్నారు. వర్గల్ మండల కేంద్రంలో మినహా అన్ని మండల కేంద్రాల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సీఎం కేసీఆర్ సూచనలతో అధికారులు నిర్మాణాలు చేపట్టారు.
ప్రజలకు అందుబాటులో అధికారులు
సమీకృత ప్రభుత్వ కార్యాలయ నిర్మాణంతో అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఒకే చోట అన్ని కార్యాలయాలు ఉండడం పాలనాపరంగా సులభంగా మారింది. సీఎం కేసీఆర్ కృషితో అత్యాధునిక హంగులతో గజ్వేల్లో ఐవోసీ నిర్మించారు. మండల కేంద్రాల్లో ఎంఐవోసీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం.
– ముత్యంరెడ్డి, గడా ప్రత్యేకాధికారి, గజ్వేల్
గతంలో అద్దె భవనాల్లో..
గజ్వేల్లో గతంలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగాయి. అందులో ఎస్టీవో, రిజిస్ట్రేషన్, మాతాశిశు, ఎక్సైజ్, మార్కెట్లో తాత్కాలిక షట్టర్లో వ్యవసాయశాఖ కార్యాలయం, లెబర్ అధికారి కార్యాలయాలు కొనసాగాయి.