హుస్నాబాద్ టౌన్, మే 2: ‘రైతులను గింత ఇబ్బం ది పెడుతున్నరు. ఏ సార్లు వస్తలేరు… ఏంసెయ్యా లే… ఎవరూ పట్టించుకునేటోళ్లులేరు.. పోయిన నెల 12వ తేదీన వచ్చినం.. ఇప్పటి వరకు వడ్లుకొనలేదు. ఎన్నిమాట్లు అడిగినా కొనేటట్లు లేరు.. ఇంత ఇబ్బంది పెడుతున్నరు. బస్తాలు అడిగితే ఈరోజు ఇచ్చిండ్రు. ఎండల మేమే నింపుకొంటున్నం. ఏం సెయ్యాలే ఇదీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రైతు జక్కుల ఎల్ల య్య రైతుగోస.. పైగా ధాన్యం ఏ గ్రేడ్ పేరుతో కొనుగోలు సైతం తగ్గించి బీ గ్రేడ్ పేరుతో కొనుగోలు చేస్తూ రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారు. పట్టణ పరిధిలోని ఆరపల్లిలో ఇరువైరెండు రోజులుగా ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ఎప్పుడు కొంటారా అని ఎదురుచూస్తున్న దయనీయమైన పరిస్థితికి నిదర్శనం.
ఒకవైపు ప్రభుత్వం ధాన్యంకొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఆరపల్లి కేంద్రంలో దాదాపు ఐదువేలకుపైగా క్వింటాళ్ల ధాన్యం రాగా ఇప్పటివరకు కేవలం మూడు లారీలధాన్యం మాత్రమే తరలించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం కొనుగోళ్లలో సైతం అధికారులు, మిల్లర్లు ఒక్కటై రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం ఏ గ్రేడ్కు క్వింటాల్కు రూ. 2,389 కాగా, బీ గ్రేడ్ క్వింటాల్కు రూ. 2,369 మద్దతు ధర చెల్లిస్తున్నది. రైతుల ధాన్యం యాభైశాతంకంటే ఎక్కువగా బీగ్రేడ్ పేరుతోనే కొనుగోలు చేస్తుండటంతో క్వింటాల్కు రూ.20 వరకు నష్టపోతున్నారు. ఇప్పటికే 40 కిలోల బస్తాకు అదనంగా 1200 గ్రాముల ధాన్యాన్ని ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఇలా క్వింటాల్కు రూ. 20ల వరకు కోతపెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.