వానకాలం సీజన్ వ్యవసాయ పనులు షురూ కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇదే అదనుగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలు నకిలీ కంపెనీలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా అందమైన ప్యాకింగ్, ఆకట్టుకునే డిజైన్లతో మార్కెట్లో ప్రవేశించాయి. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ ధరకే రైతన్నలకు విక్రయించి మోసం చేస్తున్నాయి. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు నకిలీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి టాస్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువుల దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఎవరైనా, ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడితే వారిపై పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. స్టాకు వివరాలు తెలిసేలా బోర్డు ప్రదర్శించాలని, ప్రభుత్వం నిర్ధారించిన ధరలకు మాత్రమే విక్రయించాలని, స్టాకు రిజిస్టర్లు నిర్వహించాలని సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దళారులు విత్తనాలు తరలించే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
– సంగారెడ్డి/ మెదక్ (నమస్తే తెలంగాణ), మే 19
సంగారెడ్డి/ మెదక్, (నమస్తే తెలంగాణ) మే 19 : వానకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నదాతలు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. తొలకరి వర్షాలు పడగానే విత్తనాలు విత్తుకునేందుకు సన్నద్ధమవుతుండగా, ఇదే అదనుగా భావించి విక్రయదారులు నకిలీ, నాసిరకం విత్తనాలను అన్నదాతలకు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. నకిలీ విత్తనాలతో ఎంతోమంది రైతులు నష్టపోతున్న సంఘటనలు ఏటా వెలుగు చూస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నకిలీపై నజర్ పెట్టింది. మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ఆయా మండలాలు, డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేక టాస్ఫోర్స్ వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్సు బృందాలు
నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా జిల్లా అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి జిల్లాలోకి నకిలీ విత్తనాలు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. నకిలీ విత్తనాల విక్రయాలకు చెక్పెట్టేందుకు వీలుగా వ్యవసాయ, పోలీసుశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటిసారిగా సంగారెడ్డిలో జిల్లా స్థాయిలో నాలుగు ప్రత్యేక టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక జిల్లాస్థాయి పోలీసు అధికారి, వ్యవసాయశాఖ అధికారి సిబ్బంది ఉంటారు. కలెక్టర్ పర్యవేక్షణలో నాలుగు టాస్క్ఫోర్సు బృందాలు పనిచేస్తాయి. డివిజన్ స్థాయిలో ఆరు టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో డీఎస్పీ, ఏడీ సిబ్బంది ఉంటారు.
మండల స్థాయిలో ఎస్ఐ, అగ్రికల్చర్ ఆఫీసర్, సిబ్బందితో మండల స్థాయి టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేశారు. టాస్క్ఫోర్సు బృందాలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిసూ తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయనున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 539 మంది అధీకృత విత్తన డీలర్లు ఉన్నారు. వీరితో కలెక్టర్ శరత్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తనాలు విక్రయించాలని, స్టాకు వివరాల బోర్డు ఉంచాలని, ప్రభుత్వం నిర్ధారించిన ధరలకు విత్తనాలు అమ్మాలని, స్టాకు వివరాలు రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెదక్ జిల్లాలో 20 మండలాలున్నాయి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే అన్ని మండలాల వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశామని మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాకుమారి ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. దీంతోపాటు మండలానికో టాస్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామని, ఎకడ నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినా వారిపై పీడీ యాక్టు ప్రయోగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల జిల్లా బృందం మెదక్ పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
విత్తన డీలర్లు : 539
సెంట్రలైజ్డ్ సీడ్ లైసెన్స్ డీలర్లు : 3
సీడ్ప్రాసెసింగ్ యూనిట్లు : 2
సబ్సిడీ విత్తన విక్రయ కేంద్రాలు : 47
పట్టుబడ్డ 200 కిలోల నకిలీ విత్తనాలు
ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మం డలంలో గురువారం వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి 200 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుని సీజన్ చేశారు. జిల్లాలో ఎక్కువగా నకిలీ పత్తి, వరి, సోయాబీన్ విత్తనాలు విక్రయిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, పోలీసుశాఖలు నకిలీ పత్తి, వరి, సోయాబీన్ విత్తనాల అమ్మకాలపై నిఘా వేశారు. సంగారెడ్డి జిల్లాలో మూడేండ్ల నుంచి నకిలీ విత్తనాలకు సంబంధించి 6ఏ యాక్టు 1955 కింద కేసులు న మోదు చేస్తున్నారు. 2020-21లో నాలుగు కేసులు నమోదు చేసి రూ.33,070 జరిమానా విధించారు. 2021-22లో ఒక కేసు నమోదు చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నవారిపై 5వేల జరిమానా విధించారు. 2022-23లో నాలుగు కేసులు నమో దు చేశారు. ఈ ఏడాది నకిలీ విత్తనాల విక్రయాల జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్టీ కాటన్ విత్తనాలను ప్రభుత్వం నిషేదించింది. ఈ నేపథ్యంలో వీటి అమ్మకాలు చేపడితే వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తారు.
మెదక్ జిల్లాలో పంటల సాగు ఇలా..
మెదక్ జిల్లాలో సుమారు 2లక్షల 75వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనా. మొక్కజొన్న 8వేల ఎకరాల్లో, పత్తి 48వేలు, పెసర 3,500 ఎకరాలు, సోయాబీన్ 9,641 ఎకరాలు, కందులు 9వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మొత్తంగా జిల్లాలో 3 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఎకువగా వరి పంట సాగు చేస్తుండడంతో కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు పలు రకాల విత్తన కంపెనీల పేరుతో మారెట్లో విత్తనాలను విక్రయిస్తున్నారు. కొద్దికాలంగా జిల్లాలో పలు మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా వేలాది మంది రైతుల పంట పొలాల్లో పంటలు ఏపుగా పెరిగినప్పటికీ దిగుబడి సరిగ్గా రాపోవడంతో నష్టాలను చవిచూశారు.
సంగారెడ్డి జిల్లాలో..
వానకాలం సీజన్-2023లో 7,19,529 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి, సోయాబీన్, మొక్కజొన్న, చెరుకు పంటలు సాగు అవుతాయి. 3,50,936 ఎకరాల్లో పత్తి, 1,38,380 ఎకరాల్లో వరి, 81,978 ఎకరాల్లో సోయాబీన్, 16,502 ఎకరాల్లో మొక్కొజొన్న, 1,03,628 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని అంచనా. పంటల సాగుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. రైతులను నకిలీ విత్తనాల బెడద ఆందోళన కలిగిస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దళారులు నకిలీ విత్తనాలను జిల్లాలోకి అక్రమంగా తీసుకువచ్చి రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని పసిగట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందే
అప్రమత్తమైంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. టాస్క్ఫోర్స్ బృందాల ఆధ్వర్యంలో జిల్లాలో తనిఖీలు చేపడుతున్నాం. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. ఎకడైనా నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం.
– ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మెదక్