సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 7: చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉన్నదని సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రభుత్వ ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి జడ్పీ చైర్పర్సన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతోనే నేత కార్మికుల కష్టాలు తీరాయని, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.
ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. బతుకమ్మ చీరల తయారీతో చేనేత కార్మికులకు చేతినిండా పని లభించిందని గుర్తు చేశారు. చేనేత దుస్తులకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ విజయలక్ష్మి, చేనేత సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు అశోక్, వివిధ చేనేత సహకార సంఘాల సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.