‘మానవ మనుగడను శాసించే పవిత్రమైన ప్రక్రియ రుతుచక్రం.. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో ‘రుతుప్రేమ’పై మహిళా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలే ఎక్కువగా జరిగేలా వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది శ్రద్ధ కనబర్చాలని సూచించారు. అనంతరం పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ను సందర్శించి, అభ్యర్థులతో ముచ్చటించారు. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా 95శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పట్టుదలతో చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
గజ్వేల్, మే 28: ఆరోగ్యకర సమాజానికి ప్రతిఒక్కరూ సహకరించాలని మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో ‘రుతుప్రేమ’పై మహిళా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ మనుగడను శాసించే పవిత్రమైన ప్రక్రియ రుతుచక్రం అని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. ఒక మహిళ తన జీవితకాలంలో రుతుస్రావ సమయంలో 7220 శానిటరీ ప్యాడ్స్ వాడాల్సి ఉంటుందని, దీంతో మహిళలకు ఆర్థికభారం పడడంతో పాటు పర్యావరణానికి అపారనష్టం కలుగుతున్నదన్నారు. వాడిపరేసిన శానిటరీ ప్యాడ్స్ చెత్తసేకరించే కార్మికులకు, పోగుచేసే మున్సిపాలిటీలకు ఎంతో సమస్యగా మారిందన్నారు.
రుతుస్రావం సమయంలో వినియోగించడానికి శానిటరీ ప్యాడ్స్ బదులుగా మెన్స్రువల్ కప్పులను వినియోగించాలని సూచించారు. ఒక శానిటరీ మాన్స్రువల్ కప్పును పదేండ్లు ఉపయోగించవచ్చని, ఒక మహిళకు జీవితకాలంలో 4 శానిటరీ మాన్స్రువల్ కప్పులు అవసరమవుతాయని తెలిపారు. ఇప్పటికే సిద్దిపేటలోని 5వ వార్డులో పూర్తిస్థాయిలో మహిళలకు మాన్స్రూవల్ కప్పులను వినియోగించి శుభ్రంగా, ఆరోగ్యంగా ఉన్నారన్నారు. సిద్దిపేట పట్టణంలో 3వేల మంది పోలీస్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, మహిళా, శిశుసంక్షేమ శాఖల్లోని మహిళా సిబ్బందికి ఈ మాన్స్రూవల్ కప్పులను అందించినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ అవార్డులు ప్రకటించినా, అందులో సిద్దిపేట తప్పకుండా ఉంటుందన్నారు. అదేవిధంగా శానిటరీ కప్పులను వాడి పరిశుభ్రమైన జిల్లాగా దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేలా చూడాలన్నారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇది ఒక సామాజిక కార్యక్రమమని, సమాజంలో మార్పు తేవాలనే ఉద్దేశంతో బెంగళూరుకు చెందిన సామాజిక సేవకురాలు డాక్టర్ శాంతి శానిటరీ కప్పులను ఉపయోగించడంపై మహిళలను చైతన్య పరుస్తున్నారని, అలాగే డీపీవో దేవకి, బీసీ వెల్ఫేర్ అధికారి సరోజ జిల్లాలోని మహిళా అధికారులను అధికంగా ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు వారిని శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలే ఎక్కువగా జరిగేలా వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది శ్రద్ధ కనబర్చాలని మంత్రి హరీశ్రావు సూచించారు. కార్యక్రమానికి హాజరైన వైద్యాధికారులు, స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందికి సాధారణ ప్రసవాల పెంపుదలకు కృషిచేయాలని సూచించారు. అంగన్వాడీలు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంల తో పాటు వైద్యాధికారులు మహిళలకు, గర్భిణుల కుటుంబాలకు సాధారణ ప్రసవాల గురించి వివరించి నమ్మకాన్ని కల్పించాలన్నారు. ప్రపంచ వ్యా ప్తంగా 30శాతం మాత్రమే సీ సెక్షన్ ప్రసవాలు జరుగుతుండగా, మన వద్ద 60శాతానికి పైగా సీ సెక్షన్ ప్రసవాలు జరుగుతున్నాయని ఆవేదన వ్య క్తం చేశారు. దీంతో పుట్టిన బిడ్డకు గంటలోపల తల్లిపాలు పట్టడానికి వీలు లేకుండా పోతున్నదన్నారు. ఆ సమయంలో తల్లిపాలు అమృతంతో సమానమన్నారు.
ప్రసవించిన బిడ్డ గంటలోపల తల్లిపాలు తాగడంతో శారీరకంగా, మానసికంగా చురుకుగా ఎదుగుతారని తెలిపారు. తద్వారా తల్లులకు ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. కాబట్టి కుటుంబసభ్యులు ముహూర్తాలు, మంచిరోజులు అంటూ వైద్యులపై ఒత్తిడిచేసి సిజేరియన్ ప్రసవాలకు పురికొల్పవద్దని సూచించారు. వైద్యులు, సిబ్బంది సైతం సాధారణ ప్రసవాలకే మొగ్గుచూపాలన్నారు. సాధారణ ప్రసవాలు చేసే ప్రభుత్వ దవాఖానకు రూ.3వేల చొప్పున నగదు ప్రోత్సాహాన్ని అందిస్తామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. కార్యక్రమంలోఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్సు, ఎన్సీ రాజమౌళి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు పాల్గొన్నారు.