తెలంగాణ ప్రభుత్వం సర్కారు వైద్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరుస్తూ అనేక చర్యలు తీసుకున్నది. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానల్లోనే డెలివరీలు జరిగేలా ప్రోత్సహిస్తూ కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. తాజాగా గర్భిణుల కోసం ఉచిత టిఫ్ఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కానింగ్ చేయటం వల్ల గర్భస్థ శిశువు పెరుగుదల, పుట్టుకలో వచ్చే లోపాలను ముందుగానే గుర్తించి అందుకు తగిన వైద్యం అందించేందుకు వీలు ఉంటుంది. ఈ ఉచిత పరీక్షల ద్వారా పేదలకు ఆర్థిక భారం తప్పనున్నది.
ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, గర్భిణులకు మాతా శిశు దవాఖానలు కొండంత భరోసానిస్తున్నాయి. ఇప్పటికే సర్కారు దవాఖానల్లో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్, నగదు ప్రోత్సాహం, 102 సేవలు అందుతుండగా, తాజాగా గర్భిణుల కోసం ‘టిప్ఫా’ స్కానింగ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సంగారెడ్డి, మెదక్లోని ఎంసీహెచ్, జహీరాబాద్ ఏరియా దవాఖానాలకు ఒక్కో మెషీన్ను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో యంత్రాలు ఏర్పాటు చేసేందుకు వైద్యాధికారులు చర్యలు తీసుకొంటున్నారు. గర్భం దాల్చిన 18 నుంచి 23 వారాల మధ్య పిండం ఎదుగుదల, శారీరక లోపాలు తెలుసుకునేందుకు గర్భిణులు స్కానింగ్ తప్పకుండా చేయించాలని వైద్యులు సూచిస్తారు. ప్రైవేటులో రూ.2000 నుంచి రూ.2500వేల వరకు చార్జీలు వసూలు చేస్తుండడంతో పేదలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారిపై భారాన్ని తగ్గించేందుకు ఉచితంగా టిఫ్పా స్కానింగ్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సంగారెడ్డి/ మెదక్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. జిల్లా, ఏరియా దవాఖానలను ప్రైవేటుకు దీటుగా మారుస్తున్నారు. ఇందులో భాగంగానే యేటా వేలాది మంది చిన్నారులు ఏదో ఒక లోపంతో పుడుతున్నారు. ఈ సమస్యను అధిగమించి, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. అవసరమైన వారికి టిఫ్ఫా స్కానింగ్ చేయించాలని నిర్ణయించింది. ఈ పరీక్ష ద్వారా బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించేందుకు, తద్వారా తగు వైద్యం అందించేందుకు వీలుంటుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మెదక్ మాతా శిశుసంరక్షణ కేంద్రానికి ఒకటి, సంగారెడ్డి ఎంసీహెచ్కు ఒకటి, జహీరాబాద్ ఏరియా దవాఖానకు ఒకటి చొప్పున టిఫ్ఫా యంత్రాలు మంజూరు చేసింది. ఆయా దవాఖానల్లో త్వరలోనే ఉచిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
సంగారెడ్డి జిల్లాకు రెండు టిఫ్ఫా యంత్రాలు
గైనకాలజిస్టులు తప్పనిసరిగా గర్భిణులకు టిఫ్ఫా స్కానింగ్ చేయించుకోవాలని సూచిస్తారు. దీనిని గుర్తించి ప్రభుత్వం టిఫ్ఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాకు రెండు స్కానింగ్ యంత్రాలను మంజూరు చేసింది. సంగారెడ్డి మాతా, శిశుసంరక్షణ కేంద్రానికి ఒకటి, జహీరాబాద్లో ఒక స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని పటాన్చెరు, అందోలు, నారాయణఖేడ్ ఏరియా దవాఖానల్లో సైతం ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రతిపాదననలు ఉన్నాయి. టిఫ్ఫా స్కానింగ్ చేసేందుకు శిక్షణ పొందిన రేడియాలజిస్టులు ప్రభుత్వ దవాఖానల్లో ఉన్నారు. ఒక్కో గర్భిణికి ఈ స్కానింగ్ చేసేందుకు అరగంట సమయం పడుతుంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే గర్భిణులతోపాటు శిశువులకు ఎంతో మేలు జరుగుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు.
టిఫ్ఫా స్కానింగ్ ప్రయోజనాలు..
టిఫ్ఫా స్కానింగ్ ద్వారా 18 నుంచి 22 వారాల మధ్య పిండాన్ని స్కాన్ చేస్తారు. శిశువు అవయవ క్రమం ఏర్పడే దశలోనే లోపాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా గుర్తించిన సమస్యల కు మందులు వాడవచ్చు. ప్రతి వంద మంది గర్భిణుల్లో 7 శాతం మందిలో లోపాలుండే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లందరికీ టిఫ్ఫా స్కానింగ్ చేసి ఆ లోపాలను సరిదిద్దుతారు. ఎక్కువగా మేనరికం వివాహాల వల్ల, క్రోమోజోమ్స్ లోపం వల్ల మానసిక లోపాలు (మెంటల్ డిజబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏండ్ల తర్వాత గర్భిణి కావడం వల్ల బ్యాడ్ అబ్ స్ట్రెటిక్ హిస్టరీ (గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలు తలెత్తడం) ఇలా రకరకాల కారణాలతో లోపాలు తలెత్తే అవకాశముంటుంది.
గర్భిణులకు ఐదు (18వారాలు) నెలలోపు మాత్ర మే సురక్షిత గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో గర్భంలో శిశు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? కిడ్నీ, కాలేయం, గుండె, వెన్నుపూస, కాళ్లు, చేతులు వంటివి సక్రమంగా ఉన్నాయా..? ఎదుగుదలలో లోపాలేమైనా ఉంటే టిఫ్ఫా పరీక్షలో గుర్తించే వీలుంది. గర్భస్థ శిశువుకి చికిత్సలు అందించలేని సమస్యలున్నట్లు తేలితే వైద్యుల సిఫారసుతో అబార్షన్ చేస్తారు. స్కానింగ్లో ఈ అంశాన్ని గుర్తించకుండా ప్రసవం వరకు వెళ్తే శిశువుతో పాటు తల్లి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఒక వేళ శిశువు జన్మించినా ఏదో ఒక లోపంతో కారణంగా తల్లిదండ్రులకు జీవితాంతం దుఃఖమే మిగులుతోంది. ఇలాంటి సమస్యలకు విరుగుడుగా ప్రసూతి వైద్య నిపుణులు ఐదో నెలలో తప్పనిసరిగా టిఫ్ఫా పరీక్షలు చేయిస్తున్నారు.
మెదక్ జిల్లాలో త్వరలో సేవలు..
మెదక్ జిల్లాలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఇప్పటి వరకు అందుబాటులో లేని టిఫ్ఫా (టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలిస్(టీఐఎఫ్ఎఫ్ఏ) స్కానింగ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అత్యాధునిక పరికరాన్ని తొలిసారిగా మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో రోగులకు మెరుగైన వైద్య సేలలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు, పరికరాలతో పాటు మందులను అందుబాటులో ఉంచుతుంది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రతినెలా 350 వరకు కాన్పులు చేస్తున్నారు. డెలివరీల్లో ఎంసీహెచ్ అక్టోబర్ నెలలో 384 ప్రసవాలు జరిపి జిల్లా చరిత్రలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. నవజాత శిశువుల కోసం ఎస్ఎన్సీయూ వార్డు ఏర్పాటు చేశారు. ఇందులో ఇంక్యుబేటర్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇలా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు నూతనంగా గర్భిణుల వ్యయ ప్రయాసలకు ఊరట కల్పించేందుకు టిఫ్ఫా స్కానింగ్ యంత్రం ఎంసీహెచ్లో ఏర్పాటు చేశారు.
తప్పనున్న ఆర్థిక భారం ..
ప్రస్తుతం ప్రైవేటులోనే టిఫ్ఫా స్కానింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. గర్భస్థ శిశువు ఎదుగుదల, లోపాలను గుర్తించేందుకు ఈ స్కానింగ్ తప్పని సరి కావడంతో గర్భిణులు ప్రైవేట్ను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో గర్భిణులకు టిఫ్ఫా స్కానింగ్ చేసేందుకు ఒక్కొక్కరికీ రూ.2వేల నుంచి రూ.2,400 వరకు ఖర్చు అవుతున్నది. పేదలపై ఇలాంటి భారం తప్పడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో టిఫ్ఫా స్కానింగ్ అందుబాటులోకి రానుండటంతో గర్భిణులపై ఆర్థిక భారం తప్పనున్నది.
త్వరలో ఎంసీహెచ్లో టిఫ్ఫా స్కానింగ్..
అత్యాధునిక టిఫ్ఫా స్కానింగ్ మిషన్ త్వరలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వినియోగంలోకి రానున్నది. ఇప్పటికే ఎంసీహెచ్లో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రైవేట్ దవాఖానల్లో టిఫ్ఫా స్కాన్ చేయించడానికి సుమారు రూ.2వేల నుంచి 3వేల ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు ఉచితంగా టిఫ్ఫా స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఎంసీహెచ్లో ఇప్పటికే ప్రతి నెలా 350 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. బాలింతలకు కేసీఆర్ కిట్ను అందజేస్తున్నాం.
– డాక్టర్ పి.చంద్రశేఖర్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్, మెదక్
త్వరలో ప్రారంభం..
ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు రెండు టిఫ్ఫా స్కానింగ్ యంత్రాలు కేటాయించింది. సంగారెడ్డిలోని మాతా శిశు సంరక్షణ దవాఖాన(ఎంసీహెచ్)లో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. జహీరాబాద్ ఏరియా దవాఖానలో మరో టిఫ్ఫా స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేయనున్నారు. ఎంసీహెచ్లో ఈ సేవలను త్వరలోనే ప్రారంభిస్తాం. మొదట ట్రయల్ రన్ నిర్వహించి ఆతర్వాత పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం.
– డా.అనిల్కుమార్, సూపరింటిండెంట్ ప్రభుత్వ జనరల్ దవాఖాన సంగారెడ్డి