సిద్దిపేట, అక్టోబర్ 20: గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు నవశకం రానున్నది. జస్టిస్ లోదా కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో క్రికెట్ క్రీడారంగంలో నూతన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు హైదరాబాద్ చుట్టూ తిరిగిన క్రికెట్ ఇప్పుడు జిల్లా, నగర పాలక సంస్థల్లో విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లా, నగర పాలక సంస్థల్లో క్రికెట్ సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రామీణ క్రికెటర్ల ప్రతిభకు పట్టం
గ్రామీణ ప్రాంత క్రికెటర్ల ప్రతిభ మరుగున పడిపోకుండా, వారికి అన్ని సౌకర్యాలు కల్పించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను ప్రక్షాళన చేసింది. దీంట్లో భాగంగా ఆయా జిల్లా, నగర పాలక సంస్థలను భాగస్వామ్యం చేసేందుకు జిల్లా, నగర పాలక సంస్థల్లో క్రికెట్ సంఘాలు ఏర్పాటు చేయనున్నది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే రాష్ట్ర స్థాయి సౌకర్యాలతో మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేశారు. ఈ స్టేడియంలో అంతర్జాతీయ సౌకర్యాలు కల్పించారు. ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడంతో క్రికెటర్లకు వరంలా మారింది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు కావడంతో మరిన్ని అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా, గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు కానున్న క్రికెట్ అసోసియేషన్కు చైర్మన్గా కలెక్టర్, వైస్ చైర్మన్గా ఎస్పీ/సీపీ, సభ్యులుగా అడిషనల్ కలెక్టర్లు(స్థానిక సంస్థలు, రెవెన్యూ), జిల్లా పంచాయతీ అధికారి, డీఈవో, జిల్లా క్రీడాధికారి వ్యవహరించనున్నారు.
క్రికెట్లరకు వరం..
జిల్లా స్థాయిలో క్రికెట్ అసోసియేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం. జిల్లాలు, నగర పాలక సంస్థలకు క్రికెట్ అసోసియేషన్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న హెచ్సీఏ సూపర్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ ఏసీబీ డీజీ అంజనీకుమార్కు ధన్యవాదాలు. మన ప్రాంత క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.క్రీడాకారుల ఎంపికలో గ్రామీణ క్రికెటర్లకు మేలు జరుగుతుంది. -కె.మల్లికార్జున్, సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ