పటాన్చెరు టౌన్, జూన్ 30: సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు పూర్తి నష్ట పరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విమర్శించారు. సిగాచి పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం రేవంత్రెడ్డి రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించి ఏడాది గడుస్తున్నా, ఇప్పటికీ అమలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. మృతి చెందిన కార్మికులు, గాయపడిన కుటుంబాలకు సంపూర్ణ సహకారం అందించకపోతే బీఆర్ఎస్ తరపున నిరంతర పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
సిగాచి ఘటన జరిగి ఏడాది గడుస్తున్న సందర్భంగా మంగళవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం బీపీఎల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతుల చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిగాచి ప్రమాదంలో 54 మంది మృతిచెందారని, ఇందులో 8 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదన్నారు. గాయపడినవారు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనకు కారణమైన వారిని ప్రభుత్వం అరెస్టు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి వివేక్ రూ.60లక్షల పరిహారం అందించామని చెబుతుండటం అబద్ధమని, సెబీలో రూ.118 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం చెల్లించిందని గుర్తుచేశారు. మృతులకు నివాళి అర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే, ప్రభుత్వం అనుమతించకపోవడం దుర్మార్గ వైఖరికి అద్ధం పడుతోందన్నారు. కార్మికలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని తెలిపారు. మరోవైపు సిగాచి బాధితులకు పూర్తి పరిహారం చెలించాలని సీఐటీయూ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు మండల ఇన్చార్జి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్గౌడ్, మెరాజ్ఖాన్, ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకలు పాల్గొన్నారు.