జహీరాబాద్, జూలై 15 : సర్కారు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణాల మీదికి తెచ్చింది. వైద్య పరీక్షల రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలించకుండానే చికి త్స అందించడంతో రోగి ప్రాణాపాయ స్థితి చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్ గ్రామానికి చెందిన ముత్తమ్మ ఈనెల 9న జ్వరంతో బాధపడుతూ మిర్జాపూర్(బీ)లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)కి వెళ్లింది.
అక్కడి వైద్యుల సూచన మేరకు ఆమె అక్కడే రక్త పరీక్షలు చేయించుకుంది. ఈనెల 10న ఆమె దవాఖానకు వెళ్లి ల్యాబ్ టెక్నీషియన్ వద్ద రిపోర్డులు తీసుకుంది. ఆ రిపోర్డులతో వైద్యుల వద్దకు వెళ్లింది. వైద్యులు ఆ రిపోర్టులు ఆదరాబాదరాగా చూసి ముత్తమ్మ కామెర్లు, షుగర్, మలేరియా, టైఫాయిడ్ బారినపడినట్లు చెప్పి మందులు రాసి ఇవ్వడంతో తీసుకుని ఇంటికి వెళ్లింది. రెండు రోజుల పాటు వైద్యులు ఇచ్చిన మందులు ఆమె వేసుకుంది. ఎంతకీ జ్వరం తగ్గక పోవంతో పాటు కాళ్లు, చేతులు పనిచేయకుండా పోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది.
పరిస్థితి గమనించిన కుటుంబీకులు ముత్తమ్మను బీదర్కు తరలించారు. బీదర్ వైద్యులు ఆమె పరిస్థితిని పరిశీలించి మరోసారి రక్తపరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన రిపోర్టులో అంతా నార్మల్గానే ఉన్నాయని, ఎలాంటి రోగాలు లేవని వైద్యులు గుర్తించారు. పాత రిపోర్టులను బీదర్ వైద్యులు పరిశీలించగా, మిర్జాపూర్(బీ) వైద్యులు రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలించకుండా మందులు ఇవ్వడంతో ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిందని తేల్చారు. నిర్లక్ష్యం వ్యహరించిన మిర్జాపూర్(బీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు, సిబ్బందిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తున్నది.