మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 7: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్ఫ్రైడే సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు శిలువ ఊరేగించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రార్థనలు జరిగాయి. ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు. శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు. లోక పాపములను పోగొట్టుటకు శిలువ ఎక్కాడు. ఆ రోజున పలికిన 7 ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం ఈరోజు ప్రత్యేకత. బిషప్ రెవరెండ్ పద్మారావు దైవసందేశం చేశాడు.
అనంతరం ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మెదక్ డయాసిస్ పరిధిలోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు భారీగా తరలిరావడంతో చర్చి ప్రాంతం కిటకిటలాడింది. ఈ ప్రార్థనా కార్యక్రమాలు చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య ఆధ్వర్యంలో కొనసాగాయి. భక్తుల సౌకర్యార్థం చర్చి ప్రాంగణంలో టెంట్లు, శామియానాలు ఏర్పాటు చేశారు. బిషపమ్మ విజయ, పాస్టర్లు డేవిడ్, శ్రీనివాస్, సువర్ణ, జైపాల్, సంఘ పెద్దలు గంట సంపత్, జాన్సన్, సంశాన్ సందీప్, గెలెన్ చిత్తరంజన్, సునీల్, సువన్డగ్లస్, జాయ్ముర్రే తదితరులు పాల్గొన్నారు.