రాయపోల్, జూలై 25 : సాగునీటి సరఫరా కోసం అధికారులు కాల్వ తవ్వించారు కానీ ప్రజలు ఆకాల్వ దాటేందుకు వంతెన నిర్మించడం విస్మరించారు. దీంతో అటువైపు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వం, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొండపోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి సాగు నీరు సరఫరా చేసేందుకు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అప్పాయపల్లి మీదుగా కాల్వ నిర్మించారు. అప్పాయపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతుల పొలాలు కాల్వ అవతలి వైపు ఉన్నాయి.
ఆ పొలాలకు వెళ్లేందుకు గతంలో దారి ఉండేది. కాల్వ నిర్మాణం పూర్తి కావడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు తీవ్ర అడ్డంకిగా మారింది. కాల్వ నిర్మాణ సమయంలో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు ,కాంట్రాక్టర్కు మొరపెట్టుకున్నారు. కాల్వపైన అవసరమైన చోట బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామని అధికారులు, కాంట్రాక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కానీ కాల్వ నిర్మాణం పూర్తిచేసి వంతెన నిర్మించకుండా వదిలేశారు. దీంతో రోజూ పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పొలాలకు వెళ్లే వృద్ధుల పరిస్థితి దుర్భరంగా మారింది. యువకులు వృద్ధులను మోసుకెళ్తేగాని కాల్వ దాటే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు వెంటనే స్పందించి కాల్వపై అవసరమైన చోట వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శనివారం అటు వైపు వెళ్లినప్పుడు వృద్ధులను అవతలి కాల్వ వైపు మోసుకొస్తున్న దృశ్యం ‘నమస్తే తెలంగాణ’కు కనిపించింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినధులు స్పందించి కాల్వపై వంతెన ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అప్పాయపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.