నర్సాపూర్,మే18 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు సమస్యలను రూపుమాపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు 3 కోట్ల 97 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. పెద్దచింతకుంట పాఠశాలకు 7 లక్షల 28 వేలు మంజూరు అయ్యాయని వివరాలను వెల్లడించారు.
నిధులను సక్రమంగా వినియోగించుకొని పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. అలాగే నర్సాపూర్ నియోజకవర్గానికి 3 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రమేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, జడ్పీటీసీ బాబ్యానాయక్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, తదితరులు పాల్గొన్నారు.