సిద్దిపేట, సెప్టెంబర్ 26 : తెలంగాణ ప్రజలకు, అభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అని, తెలంగాణకు సీఎం కేసీఆర్ గ్యారంటి ఉండగా ఏ పార్టీలు గ్యారంటిగా పనిచేయవని, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది సీఎం కేసీఆర్ మాత్రమే అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని మంగళవారం సిద్దిపేట వేములవాడ రోడ్డులోని సుడాపార్క్లో ఏర్పాటు చేసిన చాకలి ఆలమ్మ విగ్రహాన్ని మాజీమంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి మంత్రి ఆవిషరించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాట తప్పని, మడమ తిప్పని మహానాయకుడని పేర్కొన్నారు. బీసీలకు చేసే ఆర్థికసాయం పథకాన్ని మోదీ కాపీ కొట్టారన్నారు. 50 ఏండ్ల నుంచి చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తామని బాండ్ పేపర్లు రాసిస్తున్నారన్నారు. కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ అన్నారు. వారంలో రజకుల ఫంక్షన్ హాల్ కోసం స్థలం అప్పగిస్తానని హామీనిచ్చారు. సిద్దిపేట ఓపెన్ ఎయిర్ ఆడిటోరియానికి చాకలి ఐలమ్మ ఆడిటోరియంగా నామకరణం చేస్తున్నట్లు చెప్పారు. ఐలమ్మ అంటేనే ఉద్యమ స్ఫూర్తి అని, పేదల పక్షాన పోరాడిన వీర వనిత అని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఐలమ్మ స్ఫూర్తితో చేపట్టిన పోరాటం వల్లనే రాష్ట్రం వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంతోమంది ఉద్యమకారులను గుర్తించి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. అప్పటి ప్రభుత్వాలు రజకులను పట్టించుకోలేదన్నారు. జిల్లావ్యాప్తంగా 500మంది రజకులకు ఆర్థికసాయం అందించామన్నారు. రైతులకు ఇచ్చే రైతుబంధు, మిషన్ భగీరథ పథకాలను మోదీ కాపీ కొట్టారన్నారు. అయినా దేశంలో ఇంకా 30శాతం మందికి మాత్రమే మంచినీళ్లు అందుతున్నాయని వెల్లడించారు. గతంలో ఎక్కడ చూసినా బీడు భూములు ఉండేవి, ఇప్పుడు సీఎం కేసీఆర్ గోదావరి జలాలను తీసుకురావడంతో ఎక్కడచూసినా పచ్చదనమే కనిపిస్తుందని, తెలంగాణను దేశానికి ధాన్యాగారంగా మార్చామని మంత్రి చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎలా ఉన్నదో, ఈ తొమ్మిదేండ్లలో ఎంత మార్పు వచ్చిందో ప్రజలే ఆలోచన చేయాలన్నారు. ఆడబిడ్డలు బిందె పట్టుకొని నీళ్లకు పోవద్దని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తెచ్చి ప్రతి ఇంటికీ నీళ్లు ఇచ్చామన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణలో అన్ని రంగాల్లో సమూలమైన మార్పు తెచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి పాలనలో చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్న, బసవేశ్వరుడిని గుర్తించలేదన్నారు. నేడు వారి విగ్రహాలను ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలంగాణలో బీసీల అభివృద్ధి కోసం ఉచితంగా రూ.లక్ష ఇస్తే మన పథకాన్నే కాపీకొట్టిన నరేంద్రమోదీ బ్యాంక్ లోన్ ఇస్తున్నాడని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రజకులు మంత్రి హరీశ్రావుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఉచిత కరెంట్ ఇచ్చిన మహానాయకుడు సీఎం కేసీఆర్
రజకులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో రజకులకు ఉచిత కరెంట్ ఇవ్వడం లేదన్నారు. పట్టుదల గల నాయకులు మంత్రి హరీశ్రావును ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లక్షన్నర మెజార్టీతో గెలిపించాలని రజకులకు విజ్ఞప్తి చేశారు. రైతాంగ పోరాటానికి, సమాజ బాగు కోసం కృషి చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ వేలేటీ రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, వైస్చైర్మన్ కనుకరాజు, గొర్రెల కారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి, కౌన్సిలర్ భూంపల్లి శ్రీలతాశ్రీహరి, మల్లికార్జున్, కొండపాక ఎంపీపీ ర్యాగల సుగుణాదుర్గయ్య, నాయకుడు ప్రభాకర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.