Manjeera Pushkaralu | న్యాల్కల్, మే 3 : మండలంలోని రాఘవపూర్-హుమ్నపూర్ గ్రామ శివారులోని సరస్వతీ పంచవటీ క్షేత్రంలో జరుగుతున్న గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా భక్తజనంతో హోరెత్తింది. మరో రెండు రోజుల్లో కుంభమేళా ముగియనుండటంతో బుధవారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భక్తులు భారీగా తరలివచ్చి మంజీరానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. అనంతరం గంగమాత, శివలింగంతో పాటు పంచవటీలోని సిద్ధ సరస్వతీదేవి, షిర్డిసాయిబాబా, వేంకటేశ్వస్వామి, సూర్యభగవాన్లకు ప్రత్యేక పూజలు చేసి, దర్శించుకున్నారు. పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి వైదిక పురోహితుల మంత్రోచ్ఛారణలు, బాజాభజంత్రీల మధ్య నాగసాధువులు, దిగంబర స్వాములు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తరలివెళ్లి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, మహా హారతి ఇచ్చారు.
ఈ కుంభమేళాకు బృహన్మఠాధిపతి మణికంఠ శివాచార్య మహాస్వామి, దుద్యాలకు చెందిన అంబికా శివయోగి స్వామి, వీరబ్రహ్మేంద స్వామి, సురేంద్రస్వామి హాజరై భక్తులకు ప్రవచనాలను బోధించారు. పలువురు దాతలు భక్తులకు అన్నదానం చేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ అంటోనీ, డీఎల్పీవోలు రాఘవరావు, సతీష్ రెడ్డి, ఎంపీడీవో వెంకట్రెడ్డితో సిబ్బంది ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
కుంభమేళాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేశ్, హద్నూర్ ఎస్సై వినయ్ కుమార్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జహీరాబాద్, నారాయణ ఖేడ్ డిపోల నుంచి కుంభమేళాకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడిపారు. ఈ కార్యక్రమం లో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.