న్యాల్కల్, ఏప్రిల్ 22 : మండలంలోని రాఘవపూర్ శివారులోని సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్ర సమీపంలోని గరుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళ జరుగనున్నది. ఇక్కడకు వచ్చే నాగసాధువు, సంతులు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను కల్పించాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. శనివారం సాయంత్రం జహీరాబాద్ డీఎస్పీ రఘుతో కలిసి స్థానిక పంచవటీ క్షేత్ర ఆవరణతో పాటు మంజీరా నది తీరంలో ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలు, షవర్, ఫెన్సింగ్ కంచెలు, ప్రధాన రోడ్లకు మరమ్మతులు, మహిళల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు, తాగునీటితో పాటు బీటీ రోడ్డు, పంచవటీ క్షేత్రంలో నాగసాధులు, సంతులు ప్రవచనాలు, ప్రసంగాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టేజీ, టెంట్లు, అన్నదానం షెడ్లను పరిశీలించారు.
మంజీరా నదీ తీరంలో భక్తులు, సాధులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని సంబంధిత శాఖాధికారులను సూచించారు. వాహనాల పార్కింగ్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు తగిన ఏర్పాట్లను చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడిపించేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా, జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్, హద్నూర్ ఎస్ఐ వినయ్కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రవికుమార్, నాయకులు రాజ్కుమార్, ప్రవీణ్కుమార్, సంగ్రాంపాటిల్, షకీల్, చంద్రశేఖర్రెడ్డి తదితరులున్నారు.