హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో అమాత్యుడి ఆదేశాలు, నిర్ణయాలకే విలువ లేకుండా పోయింది. ఆ శాఖలో ఓ ఉన్నతాధికారి వ్యవహారంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి అనేక ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇదే విషయమై అమాత్యుడికి సైతం ఫిర్యాదులు అందడం, వెంటనే సదరు అధికారిని తక్షణం ఆ పోస్టు నుంచి తప్పించాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు.
కానీ నెలలు గడుస్తున్నా సొసైటీ ఉన్నతాధికారులు మాత్రం దానిని ఆచరణలో పెట్టకపోవడం అమాత్యుడి ఆదేశాలకున్న విలువేందో? అర్థమవుతున్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారి ప్రస్తుతం
ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో పాటు ఆ శాఖలో ప్రమోషన్లనే అడ్డుకొంటున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
తాజాగా సదరు అధికారి వ్యవహారం ఏకంగా విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ గురుకుల సొసైటీలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనే కీలక పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. వాటిని ప్రమోషన్ల ద్వారా భర్తీచేయాల్సి ఉన్నా కూడా సొసైటీ ఓ ఉన్నతాధికారి డిప్యుటేషన్లపై పలువురికి అడ్డదారిలో కీలక స్థానాలను అప్పగించారు. సీనియారిటీతో సంబంధం లేకుండా, సొసైటీ సిబ్బందితోనే, అదీ డిప్యుటేషన్పై ప్రధాన కార్యాలయంలో ఏండ్లకు ఏండ్లుగా అక్రమమార్గంలో తిష్టవేసిన వారితోనే కొనసాగిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్పై కొనసాగుతున్న అధికారులకు ఆ సొసైటీలోని ఆ ఉన్నతాధికారితోపాటు ఇతర అధికారులు వత్తాసు పలుకుతున్నారని, అమాత్యుడి ఆదేశాలను అమలుచేయడం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. అమాత్యుడు ఆదేశించినా ఆ ఉన్నతాధికారి పోస్టింగ్ను మార్పుపై సొసైటీ ఉన్నతాధికారులు స్పందించకపోవడం, మరోవైపు స్టాండింగ్ ఆర్డర్స్ను ఉల్లంఘిస్తూ ప్రమోషన్లను నిలిపివేయడం, అక్రమంగా ప్రమోషన్లు కల్పిస్తుండటంపై తాజాగా సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీతోపాటు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి రిజర్వేషన్ ప్రొటెక్షన్ స్ట్రగుల్ ఆర్గనైజేషన్ (ఆర్ఎస్పీవో) ఫిర్యాదు చేసింది. ఇప్పుడిదే విషయం చర్చనీయాంశంగా మారింది.