హుస్నాబాద్/దుబ్బాక ఆగస్టు 30: హుస్నాబాద్, దుబ్బాక పట్టణంతో పాటు డివిజన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో పూజలందుకునేందుకు వందలాది గణపతి విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాల దుకాణాలు కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి. వివిధ ఆకారాలు, రంగులతో తయారు చేసిన గణపతి విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పలు దుకాణాల్లో మట్టితో తయారు చేసిన విగ్రహాలను సైతం అమ్ముతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. దాదాపు అన్ని వార్డుల్లోనూ గణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు మండపాలను సిద్ధం చేశారు. మండపాల వద్ద ప్రత్యేక అలంకరణలు చేయడమే కాకుండా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ఉత్సవ కమిటీ సభ్యులు ఇప్పటికే విగ్రహాలను వివిధ వాహనాల్లో తీసుకెళ్తున్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా పోలీసులు ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి సూచనలు చేశారు.