గజ్వేల్, అక్టోబర్ 20: గజ్వేల్ కొత్త చరిత్రను తిరగరాయాలి. గజ్వేల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని, తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ఘనత మీకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అంతాయిపల్లిలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్స్లో జరిగింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి తలమానికంగా ఉన్న మిషన్ భగీరథను ప్రధాని చేతులమీదుగా ప్రారంభించుకున్న ఘనత మీదే అన్నారు. అభివృద్ధిలో గజ్వేల్ ప్రయోగశాలగా మారిందన్నారు. దేశ విదేశాల నుంచి గజ్వేల్కు వచ్చి అభివృద్ధిని చూసి పోతున్నారన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో ఎండిపోయిన చెరువులు నిండుకుండల్లా మారాయన్నారు. అడవుల పునరుజ్జీవనం చేయడం, ఆర్డీవో కార్యాలయం, 30 ఏండ్ల కుకునూర్పల్లి మండల కేంద్రం ఏర్పాటుతోపాటు మనోహరాబాద్, మర్కూక్ మండలాలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో రైల్వే లైన్ మంజూరు చేయించగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చేయలేదన్నారు.
సీఎం కేసీఆర్ నిధులిచ్చి రైల్వే లైన్ పూర్తి చేయించడంతో నేడు రైలు కల సాకారం అయిందన్నారు. నాచారం, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ ప్రాంతాల వద్ద స్టేషన్ ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతున్నదన్నారు. కేసీఆర్ లేకుంటే రైలు వచ్చేది కాదన్నారు. గజ్వేల్లో వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఫారెస్టు కళాశాల, అద్భుతంగా ప్రభుత్వ దవాఖాన, మార్కెట్ను నిర్మించుకున్నమన్నారు. ఎర్రటి ఎండల్లో హల్దీ, కూడవెల్లి వాగులు నిండుకుండలా మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. రింగ్ రోడ్డుపై పోతుంటే ఎయిర్పోర్టుకు వెళ్తున్నట్లు ఉందన్నారు. తాగునీటి ఇబ్బందులు తీరాయని తెలిపారు. గజ్వేల్ను తెలంగాణకు మార్గదర్శిగా చేశారని, గజ్వేల్కు వచ్చే పోస్టుకార్డు గద్వాల్కు పోయే రోజులను చూశామని, నేడు గజ్వేల్ పేరు చరిత్రలో నిలిచిందన్నారు. ప్రతి కార్యకర్త 35రోజుల పాటు కష్టపడి పనిచేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ కేసీఆర్కు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలకు మాట్లాడే నైతికత లేదన్నారు. గజ్వేల్లో ఊర్లకు ఊర్లే కేసీఆర్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయని చెప్పా రు. కుల సంఘాలు, అసోసియేషన్లు ముందుకొస్తున్నాయన్నారు. సమన్వయంతో పని చేసి భారీ మెజార్టీ ఇవ్వాలన్నారు.