జిన్నారం, ఫిబ్రవరి 8 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని లీఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని సాల్వెంట్ యార్డులో(ఎస్ఆర్పీ)లో ఉదయం 10:30 సమయంలో రసాయనాల ప్రతిచర్య జరుగుతుండగా ఒక్కసారి గా మంటలు ఏర్పడి ఉధృతంగా మారాయి. అక్కడి నుంచి కార్మికులు, సిబ్బంది పరుగులు తీయగా ఒక కార్మికుడికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. హెటిరో పరిశ్రమ నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్, సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమించింది. లీఫార్మా కార్మికులు, సిబ్బంది మరోపక్క ఫోమ్తో మంటలు ఆర్పేందుకు శ్రమించారు.
పటాన్చెరు నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ ఒకపక్క, హెటిరో పరిశ్రమ ఫైర్ ఇంజన్ మరో పక్క మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు తగ్గినట్లే తగ్గి క్రమంగా పెరిగి ఉధృతమయ్యాయి. మంటల వేడికి సాల్వెంట్ డ్రమ్ములు పేలి మంటలు ఎగిసిపడ్డాయి. భయపడిన కార్మికులు పరిశ్రమ నుంచి దూరంగా వచ్చారు.
జీడిమెట్ల నుంచి మరో ఫైర్ ఇంజిన్ రావడంతో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఉదయం నుంచి మధ్యా హ్నం మూడు గంటల వరకు మంటలను ఆర్పేందుకు శ్రమించారు. పరిశ్రమను ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ ఛీప్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.
ప్రమాదానికిగల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా సాల్వెంట్ యార్డులో మంటలు ఏర్పడడానికి అక్కడ పని చేస్తున్న కార్మికుల నిర్లక్షమే కారణమని సిబ్బంది తెలిపారు. జాగ్రత్త గా వ్యవహరించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం, ఆస్తినష్టం జరిగేది కాదన్నారు. పరిశ్రమను బొల్లారం సీఐ సురేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాశెట్టిరాజు పరిశీలించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజయ్య పరిశ్రమను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాగా లీఫార్మాలో జరిగిన భారీ ప్రమాదంతో గడ్డపోతారం పారిశ్రామికవాడలోని పరిశ్రమ యాజమాన్యాలు, కార్మికులు భయాందోళన చెందారు. మంటలు అదుపులోకి రావడంతోనే అందరూ ఊపిరి పీల్చుకున్నారు.