Hyderabad to Medak | తెలంగాణ రాష్ట్రం రాక ముందు మెదక్-హైదరాబాద్కు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో వెళ్లాలంటే 3గంటల సమయం పట్టేది. ఇప్పుడు 2.30 గంటల్లోనే హైదరాబాద్కు చేరుకుంటున్నారు. అదే ఎక్స్ప్రెస్ బస్సులో మెదక్ నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే 2.25 గంటల సమయం పట్టేది. ఇప్పుడు 2.10 గంటల్లోనే హైదరాబాద్కు చేరుకుంటున్నారు. రోడ్లు మంచిగుండడంతో వాహనాల వేగం పెరిగింది. గతంలో 40 కిలోమీటర్లకు మంచి స్పీడ్గా వెళ్లేందుకు రోడ్లు అనుకూలంగా ఉండేవి కావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రోడ్లు బాగా అభివృద్ధి చెందాయి. దీంతో ఇప్పుడు 60 నుంచి మొదలుకుని 90 కిలోమీటర్ల స్పీడ్ వరకు వాహనాలు వెళ్లగలుగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు త్వరగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మైలేజీ కలిసి వస్తున్నది.
గతంలో వర్షం వచ్చి వాగు పారిందంటే రాకపోకలు నిలిచిపోయేవి. కొద్దిపాటి వర్షం కురిసినా వాగుల్లో వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. గతుకులు, గుంతలు పడిన రహదారులతో ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రహదారులు బాగయ్యాయి. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లాకేంద్రానికి బీటీ రోడ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. సింగిల్ రోడ్లు డబుల్గా, డబుల్ రోడ్లు నాలుగు లేన్లుగా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అనేక వంతెనల నిర్మాణం పూర్తిచేసింది.
గతేడాది మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం వాడి-దూప్సింగ్ తండా మధ్యలో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి బ్రిడ్జిని పరిశీలించి వెంటనే నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి, పూర్తిచేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వంతెనలు, కల్వర్టులు, బ్రిడ్జిలు జిల్లా వ్యాప్తంగా కనబడుతాయి. 2016 నుంచి మెదక్ జిల్లాలో బ్రిడ్జిలు, వంతెనలు, కల్వర్టులతో పాటు రహదారుల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది.
సమైక్య రాష్ట్రంలో పల్లెల్లో ప్రయాణం గతుకులు, గుంతల రోడ్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒక ఊరికి వెళ్లాలంటే గంటల సమయం పట్టేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లె రోడ్లకు మహర్దశ వచ్చింది. ఒకప్పుడు ఒక ఊరి నుంచి మండల కేంద్రానికి రావాలంటే గంట సమయం పట్టేది. ఇప్పుడు 30 నిమిషాల్లో చేరుకోగలుగుతున్నారు. జిల్లాలోని మెదక్, హవేళీఘనపూర్, రామాయంపేట, నిజాంపేట, కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్, వెల్దుర్తి, మనోహరాబాద్, చేగుంట, తూప్రాన్ ఇలా అన్ని మండలాల పరిధిలోని గ్రామాలకు రోడ్ల నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టింది.
నర్సాపూర్ నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి, నూతన రహదారుల ఏర్పాటుకు పీఆర్ శాఖ ద్వారా 339 పనులకు రూ.161.80 కోట్లతో పనులు చేపట్టారు. నర్సాపూర్ మండలంలో 126 పనులకు రూ.40.33 కోట్లు, శివ్వంపేటలో 73కు రూ.33.60 కోట్లు, వెల్దుర్తిలో 30కు రూ.28.57 కోట్లు, కౌడిపల్లిలో 30కు రూ.26.46 కోట్లు, కొల్చారంలో 16కు రూ.22.40 కోట్లు, చిలిపిచెడ్ మండలంలో 26 పనులకు రూ.10.62 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది.
మెదక్ నియోజకవర్గ పరిధిలో రహదారుల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా 463 రహదారుల అభివృద్ధికి రూ.115.95 కోట్లు వెచ్చించారు. మెదక్ మండలంలో 66 రహదారులకు రూ.16.23 కోట్లు, హవేళీఘనపూర్లో 23కు రూ.31.45 కోట్లు, నిజాంపేటలో 7 రోడ్లకు రూ.14.23 కోట్లు, పాపన్నపేటలో 136కు రూ.17.14 కోట్లు, రామాయంపేటలో 155కు రూ.25.30 కోట్లు, చిన్నశంకరంపేటలో 76కు రూ.11.87 కోట్లతో రహదారుల పనులు ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా వంతెనలు (హైలెవల్ బ్రిడ్జిలు), కాజ్వేలు, చెక్డ్యాం కమ్ బ్రిడ్జిల నిర్మాణాలకు పంచాయతీరాజ్శాఖ ద్వారా నాబార్డు నిధులతో 17 బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.17.77 కోట్లు మంజూరయ్యాయి. హవేళీఘనపూర్ మండలంలో 11 బ్రిడ్జి, కాజ్వే నిర్మాణానికి రూ.13.59 కోట్లు, మెదక్ మండలంలో 4 బ్రిడ్జి కాజ్వేలకు రూ.1.39 కోట్లు, నిజాంపేట్ మండలంలో 2 బ్రిడ్జి, కాజ్వేల నిర్మాణానికి రూ.2.80 కోట్లతో పనులు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రహదారులు మెరుగుపడ్డాయి. మెదక్ జిల్లాలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం. మెదక్-హైదరాబాద్ రూట్లో ఆర్టీసీ బస్సుల వేగం చాలా పెరిగింది. గతంలో 2.25 గంటల్లో వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు ఇప్పుడు 2.10 గంటల్లోనే హైదరాబాద్కు చేరుకుంటున్నది. రోడ్డు ప్రమాదాలు చాలా తగ్గాయి. ఆర్టీసీకి మైలేజ్ మంచిగా వస్తున్నది. రోడ్లు అద్దంలా ఉండడంతో స్పేర్పార్ట్స్ ఎక్కువగా మరమ్మతులు కావడం లేదు. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సుఖవంతంగా మారింది.
– ఎం.రవిచందర్, మెదక్, నర్సాపూర్ డిపోల మేనేజర్