హుస్నాబాద్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో నాణ్యమైన బోధన
మొదటి బ్యాచ్లో శిక్షణ పొందుతున్న 200 మంది యువత
హుస్నాబాద్, మే6: గ్రామీణ యువతకు ఏదో విధంగా సహకరించి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం పొందేలా చేయాలనే హుస్నాబాద్ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ లక్ష్యం యువతీ యువకులకు వరంగా మారింది. నియోజకవర్గంలో డిగ్రీ, పీజీలు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సుమారు 80వేలకు పైగా ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తామనే ప్రకటనలో యువత మొత్తం కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీసింది. వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న యువతను ఆదుకునేందుకు ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ముందుకొచ్చారు. నియోజకవర్గంలో ఉన్న యువతీ యువకులకు మూడు దఫాలుగా ఒక్కో బ్యాచ్లో 200మంది చొప్పున మూడు బ్యాచ్లుగా చేసి మొత్తం 600 మందికి పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో బ్యాచ్కు మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఇందుకు అయ్చే ఖర్చు మొత్తం ఎమ్మెల్యేనే భరిస్తున్నారు. ఏప్రిల్ 18వ తేదీన హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో తానే స్వయంగా ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి శిక్షణ శిబిరం నిరాటంకంగా కొనసాగుతోంది.
కార్పొరేట్ కోచింగ్ సెంటర్లను తలపించేలా..
కార్పొరేట్ కోచింగ్ సెంటర్లను తలపించేలా హుస్నాబాద్లోని ఉచిత శిక్షణ శిబిరం కొనసాగుతోంది. సుమారు 10 నుంచి 15ఏండ్ల అనుభవమున్న ఫ్యాకల్టీలను హైదరాబాద్ నుంచి రప్పించి తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలతో పాటు పోలీసు, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, ఎస్ఎస్సీ ఉద్యోగాల కోసం ఉపయోగపడే విధంగా తరగతులు నిర్వహించడం, మెటీరియల్ అందిస్తున్నారు. శిక్షణ తరగతుల్లో భాగంగా జియాగ్రఫీ, సైకాలజీ, ఇండియన్ హిస్టరీ, రాజనీతిశాస్త్రం, భారత రాజ్యాంగం, అర్థశాస్త్రం, అర్థమెటిక్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, రీజనింగ్, ఇంగ్లిష్ గ్రామర్, జనరల్ సైన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర సబ్జెక్టులను బోధిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.
సకల సౌకర్యాలతో ఉచిత శిక్షణ
హుస్నాబాద్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సకల సౌకర్యాలతో ఉచిత శిక్షణ శిబిరం నడుస్తోంది. విద్యార్థులకు తాగునీరు, వేసవి దృష్ట్యా కూలర్ల ఏర్పాటు, బ్రేక్ టైంలో స్నాక్స్ ఇస్తున్నారు. ప్రశాంతమైన హాలులో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఫ్యాకల్టీతో పాటు శిబిరం నిర్వహణకు రోజుకు కనీసం రూ.10 నుంచి 12వేల ఖర్చు అవుతోంది. ఆర్టీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ మహేశ్కుమార్ తరగతుల నిర్వహణ, అభ్యర్థుల సౌకర్యాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నాణ్యమైన కోచింగ్ ఇప్పిస్తున్న ఎమ్మెల్యే సతీశ్కుమార్కు అభ్యర్థులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
అనుభవజ్ఞ ఫ్యాకల్టీతో శిక్షణ
ఎమ్మెల్యే సతీశ్కుమార్ సొంత ఖర్చులతో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఎమ్మెస్సీ పూర్తి చేసిన నేను, హైదరాబాద్లాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్థోమత లేదు. నాలాంటి వారి కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ సారి ఏదో ఒక ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. మూడు నెలల శిక్షణ అనంతరం ప్రింట్ మెటీరియల్ కూడా అందిస్తే మాకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
– బెజ్జంకి రవి, నవాబుపేట, కరీంనగర్ జిల్లా
గ్రూప్ లేదా పోలీసు ఉద్యోగం సాధిస్తా..
మాలాంటి పేద, మధ్య తరగతి యువత కోసం ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి సహకారాన్ని అందిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇంకా కష్టపడి చదివి తప్పకుండా ఉద్యోగం సాధిస్తాం. నేను ఈ సారి గ్రూప్ లేదా పోలీసు ఉద్యోగం సాధిస్తా. ఇందుకోసం నిత్యం కోచింగ్ సెంటర్ వచ్చి శ్రద్ధగా తరగతులు వింటున్నా. మంచి వాతావరణంలో కోచింగ్ ఇప్పిస్తున్న ఎమ్మెల్యే సార్కు రుణపడి ఉంటాం.
– గడిపె ప్రవీణ్, హుస్నాబాద్