హుస్నాబాద్, ఫిబ్రవరి 9: వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ను మళ్లీ ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న పురస్కారం రావడంపై సమావేశం ఏకగ్రీవంగా హర్షం వ్యక్తం చేసింది. సమావేశంలో సిద్దిపేట జడ్పీ వైస్చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ రజనీతిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.