సంగారెడ్డి జూన్ 18(నమస్తే తెలంగాణ): ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. కార్యకర్త ఆపదలో ఉన్నాడంటే పార్టీ నాయకత్వం వారికి అండగా నిలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్త అశోక్కుమార్ ఘటన ఉదాహరణగా చెప్పొచ్చు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మేడికుంద గ్రామానికి చెందిన అశోక్కుమార్ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని బుధవారం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులు అశోక్కుమార్ను సంగారెడ్డిలోని హోప్ దవాఖాన నుంచి లాక్కెళ్లారు. అశోక్కుమార్ మిస్సింగ్ వెంటనే అందోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులకు తెలిసింది.
ఈ విషయాన్ని వారు వెంటనే అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యకర్త అశోక్కుమార్ మిస్సింగ్ విషయం తెలిసిన క్రాంతికిరణ్ హుటాహుటిన రంగంలోకి దిగారు. సంగారెడ్డిలోని హోప్ దవాఖానకు వెళ్లి అక్కడి నుంచి అశోక్కుమార్ జాడను పసిగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. హోప్ దవాఖానతో పాటు ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలను క్రాంతికిరణ్ పరిశీలించారు. సీసీ కెమెరాల్లో అశోక్కుమార్ను ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్తున్నట్లు కనిపించింది. ఆ ఇద్దరు ఎవరూ అనేది తెలుసుకోలేకపోయారు. జోగిపేట, వట్పల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులకు సీసీ ఫుటేజ్ చూయించారు. జోగిపేట పట్ణణానికి చెందిన కార్యకర్తలు సీసీ ఫుటేజ్లో ఉన్నవారిలో ఒకరు పోలీసు అధికారిగా కనిపెట్టారు.
ఇదివరకు జోగిపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించినట్లు క్రాంతికిరణ్కు తెలిపారు. దీంతో వెంటనే సదరు పోలీసు అధికారి ఏ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నది తన పరిచయాల ద్వారా కనిపెట్టారు క్రాంతి. అతను జహీరాబాద్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని, ఆలస్యం చేయకుండా పార్టీ నాయకులతో కలిసి హుటాహుటిన సంగారెడ్డి నుంచి జహీరాబాద్ బయలుదేరివెళ్లారు. జహీరాబాద్ పోలీస్టేషన్కు వెళ్లి అశోక్కుమార్ గురించి ఆరా తీయగా సీఎంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అరెస్టు చేసినట్లు జహీరాబాద్ పోలీసులు క్రాంతికిరణ్కు తెలిపారు.
పోలీస్ స్టేషన్లో ఉన్న అశోక్కుమార్ను కలిసిన క్రాంతికిరణ్ ధైర్యంగా ఉండాలని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందని, పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యేలా చేస్తామని భరోసా కల్పించారు. ఆ తర్వాత పోలీసు అధికారులతో క్రాంతికిరణ్ మాట్లాడుతూ అశోక్కుమార్పై ఫిర్యాదు వస్తే నిబంధనలకు అనుగుణంగా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మఫ్టీ పోలీసులు దవాఖాన వద్ద ఉన్న అశోక్కుమార్ను అక్రమంగా అరెస్టు చేయటం చట్టవిరుద్ధమన్నారు.
కాంగ్రెస్ ముఖ్యనేతల ఒత్తిడి మేరకు అక్రమంగా అరెస్టు చేశారని, అశోక్కుమార్పై తప్పుడు కేసులు బనాయించకుండా వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఇద్దరు అశోక్ విడుదల కోసం పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఇద్దరు నేతల వత్తిడి మేరకు పోలీసులు అశోక్ కుమార్కు స్టేషనల్ బెయిల్ ఇచ్చి బుధవారం రాత్రి విడుదల చేశారు. అశోక్కుమార్ అరెస్టు వెనక కాంగ్రెస్ ముఖ్యనేత ఉన్నారని తన ప్రాంతం పోలీసులతో అరెస్టు చేయించి కేసులు పెడితే స్థానకంగా తనకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గ్రహించి జహీరాబాద్లో అక్రమ కేసులు పెట్టించారని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తెలిపారు.