సిర్గాపూర్, మార్చి 28: నారాయణఖేడ్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగుచేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలని శనివారం సిర్గాపూర్ ప్రధాన కూడలిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిర్గాపూర్-నారాయణఖేడ్ డబుల్ లైన్ బీటీ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిర్గాపూర్ నల్లవాగు మీదుగా మాసన్ పల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… డాంబర్ ప్యాచ్ వర్క్ చేసే చోట మొరం పోసి బీటీ రోడ్డును మట్టి రోడ్డుగా మార్చిన ఘనత కాంగ్రెస్ పాలకులకే దక్కిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో సిర్గాపూర్-నారాయణఖేడ్ రోడ్డు పనులకు రూ.15 కోట్లు మంజూరు చేయించి, పనులు ప్రారంభించామన్నారు. సిర్గాపూర్-నల్లవాగు-మాసన్పల్లి 20 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి తాను బీఆర్ఎస్ హయాంలో అనుమతులు తెచ్చానని, కానీ.. కాంగ్రెస్ సర్కారు ఈ రోడ్ల గురించి పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించారు. వాహనాలు నడిపించేందుకు వీలు లేకుండా రోడ్లు అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు అన్నివర్గాలను మోసం చేసిందన్నారు.
రైతుబంధు పేరును రైతుభరోసాగా మార్చి, రెండు విడతలు ఎగ్గ్గొట్టిందని మండిపడ్డారు. వ్యవసాయానికి సక్రమంగా కరెంట్ సరఫరా కావడం లేదన్నారు. లోఓల్టేజీ విద్యుత్, కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు, స్థానిక ఎమ్మెల్యే బుద్ది తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితవు పలికారు. ధర్నాలో యువ నేత రోషణ్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరావు పాటిల్, మాజీ ఎంపీపీ మహిపాల్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ప్రయాగ మాధవరావు పాటిల్, మాజీ ఎంపీటీసీ శాంతాబాయి, సర్పంచ్ ధర్మానాయక్, తుకారం, ఉప సర్పంచ్ రమేశ్, మాజీ సర్పంచ్లు రవీందర్, బసిరెడ్డి, విజయ్, బాలాజీ, సంజీవరెడ్డి, భూంరెడ్డి, యాదవరావు పాటిల్, యూత్ నాయకుడు నర్సాగౌడ్, రైతులు హన్మంత్రెడ్డి, వసీం, శ్రీనివాస్రెడ్డి, సాయిరామ్, మహేందర్గౌడ్, నారియా నాయక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.