పాపన్నపేట, ఏప్రిల్ 5: రైతులను నమ్మించి మోసంచేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొత్తపల్లిలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరికి బోనస్ ఇవ్వని కాంగ్రెస్ను నిలదీయాలన్నారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా, విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, మహిళలకు మహాలక్ష్మీ ద్వారా రూ.2500 సాయం, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతుబంధు ఇచ్చారని, కాంగ్రెస్ సర్కారు మాత్రం రైతులను చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని, పొలాలు ఎండిపోతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం కరెంట్ కోతలు లేవని అంటున్నాడని, సమావేశంలో నేను మాట్లాడుతుండగా మీముందే కరెంట్ పోయిందని, రాష్ట్రంలో కరెంట్ కోతలకు ఇదే సాక్షం అని హరీశ్రావు అన్నారు. మొన్న ఎన్నికల్లో ఆశపడి మోసపోయామని, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, బాండ్ పేపర్ మీద రాసి మాట తప్పిన కాంగ్రెస్ను బొంద పెట్టాలని ప్రజలకు హరీశ్రావు పిలుపునిచ్చారు. సోనియాగాంధీ, రాహుల్గాంధీలను తీసుకొచ్చి, ఆరు గ్యారెంటీలు ప్రకటించి అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తామని మోసం చేశారన్నారు. మొన్న రేగోడ్ మండలంలో రైతులకు బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. రేవంత్రెడ్డి రుణమాఫీ చేస్తారని ప్రకటించారని రైతులు బ్యాంకు అధికారులకు చెబితే తమకు సంబంధం లేదంటున్నారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో చెక్డ్యామ్లు నిర్మించి ఘనపురం ఆనకట్ట నుంచి నీళ్లను విడుదల చేసుకున్నామని గుర్తు చేశారు. ఏడుపాయలకు మంజూరు చేసిన రూ.100 కోట్ల నిధులను రద్దుచేసిన కాంగ్రెస్కు పతనం ఖాయమని హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల, రింగ్ రోడ్డుకు నిధులు, రామాయంపేట రెవెన్యూ డివిజన్, సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడికి నీటి విడుదల కోసం బీఆర్ఎస్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మంచి వ్యక్తి అని, సేవాగుణంతో పాటు ధనం ఉన్న వ్యక్తి అని, రూ.100 కోట్లతో ఆయన ట్రస్టు ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగకరమైన పనులు చేస్తారని తెలిపారు. దుబ్బాక ప్రజలు రఘునందన్ను బండకేసి కొట్టారన్నారు. బీజేపీ మనకు ఒక్క మంచి పనిచేసిందా అని ప్రశ్నించారు. నల్లధనం తెచ్చి పేదలకు పంచుతామని చెప్పి మోసం చేశారన్నారు.
ప్రజాసేవ చేసేందుకు
తాను ప్రజాసేవ చేయడానికే మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ స్థానానికి పోటీచేస్తున్నానని వెంకట్రామిరెడ్డి అన్నారు. తనను ఆశీర్వదించి అక్కున చేర్చుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. మెదక్ జిల్లాలో తాను డ్వామా పీడీగా, జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్ పనిచేశానని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికి దక్కని అవకాశం తనకు దక్కిందన్నారు. చంద్రబాబు, వైఎస్ఆర్, కిరణ్కుమార్ రెడ్డి, కేసీఆర్ల వద్ద పనిచేసిన అనుభవం ఉందన్నారు. కలెక్టర్గా మెదక్ గడ్డ తనకు ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టిందన్నారు. ఎంపీగా గెలిస్తే పరిపాలన అనుభవంతో పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్ర నిధులు తీసుకు వస్తానన్నారు. పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఫంక్షన్హాళ్లు నిర్మించి ఉచితంగా ఇస్తానన్నారు.
బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి అని అన్నారు. వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించి ఓటమికి ప్రతీకారం తీర్చుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నగేశ్, సోములు, విష్ణువర్ధన్రెడ్డి, కుమ్మరి జగన్నాథం, గురుమూర్తి గౌడ్, వెంకట్రాములు, శ్రీనాథ్, అనురాధ, బాబాగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.