సదాశివపేట, ఏప్రిల్ 29: ఆరు గ్యారెంటీలు అన్ని చెప్పి గద్దెనెక్కి మోసం చేసిన కాంగ్రెస్ను, పదేండ్లలో తెలంగాణకు ఏమిచేయని బీజేపీని ఎంపీ ఎన్నికల్లో బొందపెట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో సదాశివపేటలో హరీశ్రావు రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్ షో స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి సిద్దాపూర్ గౌని, సుభాష్రోడ్డు మీదుగా గాంధీ చౌక్ వరకు చేరుకుంది. అనంతరం గాంధీచౌక్ వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారన్నారు. రెండు లక్షల రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్కు ఓటెయ్యాలి, రుణమాఫీ కానోళ్లు బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. రైతుభరోసా, వడ్లు, మక్కలకు రూ. 500 బోనస్ ఏమైందని కాంగ్రెస్ను ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బాండ్ పేపర్లపైన రాసిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో దేవుడి మీద ఒట్లు వేసి గెలవాలని చూస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఇస్తే నేడు 14 గంటల కరెంటు మాత్రమే వస్తున్నదన్నారు. కరోనా కష్టకాలంలో రైతుబంధు వేశామని, రైతుబీమా ఇచ్చామన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ మోసపోయే పరిస్థితి వస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరీశ్రావు సూచించారు. నాలుగు నెలల పింఛన్ ఇస్తామని చెప్పి నాలుగు నెలలైందని, ఇప్పటికీ పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం జనవరి పింఛన్ డబ్బులు ఎగ్గొట్టిందన్నారు. పింఛన్దారులకు రేవంత్రెడ్డి ఎనిమిది వేలు బాకీ పడ్డారని, ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ప్రతి మహిళకు ప్రభుత్వం పది వేలు బాకీ పడిందని, అవి తీర్చాకనే గ్రామాల్లోకి రావాలని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని మాటచెప్పి తప్పినట్లు హరీశ్రావు గుర్తుచేశారు. సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసిన విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హరీశ్రావు కోరారు.
ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. గెలిచిన నెల రోజుల్లోనే సొంత డబ్బులు రూ. 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో తనకు 11 ఏండ్ల అనుభవం ఉందన్నారు. ఏడున్నర సంవత్సరాల పాటు జాయింట్ కలెక్టర్, కలెక్టర్గా పనిచేసి ప్రజలకు సేవలందించానన్నారు. అదేగడ్డపై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, పేదలకు ఉచితంగా పెండ్లీలు చేసుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్హాల్ నిర్మిస్తానన్నారు. వేలాది పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు కోచింగ్, యువతకు వృత్తి నైపుణ్య కోర్సులు ఏర్పాటు చేస్తానన్నారు. యువతకు శిక్షణ అందించి జాబ్మేళా ద్వారా ఉపాధి అవకాశం కల్పిస్తానన్నారు. 15 రోజులు తన వెంట నడిస్తే జీవితకాలం మీ వెంటే ఉంటానని కర్యకర్తలకు భరోసా ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా తనకు అనువణువు తెలుసని, ఎంపీగా గెలిస్తే పరిపాలన అనుభవంతో ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోడూరి రమేశ్, బీఆర్ఎస్ నాయకులు శివరాజ్పాటిల్, ఎంఏ ముఖీమ్, రాజేశ్వర్రావు దేశ్పాండే, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.