జహీరాబాద్, జనవరి 25 : గిరిజలను అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేసి, మీ తండాల్లో మీ పాలన తీసుకువచ్చారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. గురువారం మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండాలో జరిగిన మోతిమాత జాతరలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలకు పంచాయతీలుగా గుర్తింపునిచ్చి సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మించి అన్ని మౌలిక వసతులు కల్పించిందన్నారు. కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశపెట్టి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక సాయం అందించిందన్నారు. గిరిజనుల కోసం హైదరాబాద్లో బంజారా భవన్ నిర్మించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. సేవాలాల్ జయంతిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు. మోతిమాత ఆశీస్సులతో గిరిజన తండాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరుకు హామీ ఇచ్చారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మోతిమాత ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు దేవాలయ ఎంతో కృషి చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు, తాగునీరు, రోడ్లు, సామూహిక భవనం నిర్మించామన్నారు. ఆలయ అభివృద్ధికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు.
మోతిమాత జాతరకు గిరిజనులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ర్టాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. కార్యక్రమంలో గిరిజనుల గురువు గోవింద్ మహారాజ్, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం, టెలికాం బోర్డు సభ్యులు, సజ్జారావుపేటతండా సర్పంచ్ పవార్ శంకర్నాయక్, దేవాలయం కమిటీ సభ్యులు గోపాల్, రాంశెట్టి, దేవిదాస్ జాదవ్, శ్రీనివాస్నాయక్, వాసునాయక్, హీర్ రాథోడ్, బీఆర్ఎస్ నాయకులు గోవర్థన్రెడ్డి, తట్టు నారాయణ, జైపాల్నాయక్, సంజీవ్కుమార్, తదితరులు ఉన్నారు.