సంగారెడి, మార్చి 26(నమస్తే తెలంగాణ) : గులాబీ అడ్డా అయిన మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సత్తాచాటుదామని క్యాడర్కు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కంచుకోట మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్కు ఎగురవేస్తామని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సౌమ్యుడు, మంచి మనస్సున్న వ్యక్తి అని, పేదలకు అండగా ఉండే ఆయనను ఎంపీగా గెలిపించాలని ఓటర్లను కోరారు. మెదక్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రతిపక్ష పార్టీలకు అర్థమైందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తామని వచ్చిన పలువురు నేతలు విషయం అర్థమై తోకముడిచి వెళ్లిపోయారన్నారు. బీజేపీ అభ్యర్థి పనిమంతుడి అయితే దుబ్బాక ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిపించేవారని, పనికిరాడు కాబట్టే అక్కడి ప్రజలు బీజేపీ ఎంపీ అభ్యర్థిని ఓడించారన్నారు. మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే ఆ పార్టీ కండ్లు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను తిరిగి నెరవేరుస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని, తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఆ పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందన్నారు. మైనార్టీలు కాంగ్రెస్కు ఓటు వేసి వృథా చేయవద్దని, సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలంగాణకు అన్యాయం చేశాయని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. రైతులు సాగునీరు, కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఓట్ల కోసం పల్లెల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్కు చురకలు పెడితే తప్పకుండా ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరుస్తుందన్నారు. రేవంత్రెడ్డి బీజేపీతో కలిసిపోయారని విమర్శించారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు ఓటు వేయవద్దని కోరారు. బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో ఏమి చూసి ఓటు వేయాలని ప్రశ్నించారు. బీజేపీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉన్నా పేదలు, రైతులు, కార్మికులు బతుకుల్లో ఎలాంటి మార్పు తేలేదన్నారు. అలాంటి పార్టీకి ఎన్నికల్లో ఓటు వేయవద్దని హరీశ్రావు కోరారు.
మైనార్టీలు కాంగ్రెస్కు ఓటువేసి ఓటును వృథా చేయవద్దని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటయ్యాయన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే కవితను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మైనార్టీ వర్గం నుంచి క్యాబినెట్ మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ విషయాన్ని మై నార్టీలు గమనించాలన్నారు. గతంలో కేసీఆర్ సర్కారులో మైనార్టీలకు హోం, రెవెన్యూ లాంటి కీలక మంత్రి పదవులు ఇచ్చినట్లు గుర్తుచేశారు. మతతత్వ బీజేపీ, మోసకారి కాంగ్రెస్కు దూరంగా ఉండాలని, సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని మైనార్టీలను కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, శివకుమార్, మామిళ్ల రాజేందర్, మాణిక్యం, బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, జైపాల్రెడ్డి పాల్గొన్నారు.
మెదక్ ఎంపీగా గెలిస్తే పేద విద్యార్థులు, బీఆర్ఎస్ కార్యకర్తల పిల్లల చదువుల కోసం రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంట్రామిరెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 ఏండ్ల పాటు సేవలు అందించానని, ఇక్కడి ప్రజలతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. సిద్దిపేట ప్రాంతానికి చెందిన సౌమ్యతో పాటు పలువురు పేద పిల్లలను దత్తత తీసుకొని వారు ఉన్నత చదువులు చదువుకునేలా సహకరించినట్లు చెప్పారు. ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు అన్ని రకాలుగా సేవచేస్తానని, మెదక్ పార్లమెంట్ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఏడు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఉపయోగించుకునేలా ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తానన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు తన విజయానికి సహకరించాలని ఆయన కోరారు.
సంగారెడ్డి, మార్చి 26: మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కానుక ఇద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని, మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని విమర్శించారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించి సత్తాచాటుదామని చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు.
– ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు, తాగునీటి కష్టాలు ఎదురు కాలేదని, నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేక పోతున్నారని ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్కు అభ్యర్థి దొరకలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కారు అమలు చేయడం లేదన్నారు. బ్యాంకర్లు గ్రామాల్లో రైతుల నుంచి దౌర్జన్యంగా పంట రుణాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారిగా పనిచేశారని, ఆయనను గెలిపించి సత్తాచాటుదామని పిలుపునిచ్చారు. అధికారం కోల్పోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవరించిందని, ఎంపీ ఎన్నికల్లో గెలిచి పూర్వవైభవాన్ని చాటుదామని ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు తనపై దుబ్బాకలో పోటీచేసి ఓడిపోయినా బుద్ధ్ది రాలేదన్నారు. మరోసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి కలెక్షన్లు చేసుకునేందుకే వచ్చాడని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ నాయకులు గద్దెనెక్కి వందరోజులు పూర్తయినా ఇతర హామీలు ఎందుకు అమ లు చేయడం లేదని సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నదని, ప్రలోభాలకు గురిపెట్టి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నదని ఆరోపించారు. రోజుల పాలనలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఇతర పథకాలు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.2500, ఆడపిల్లల పెండ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం అందజేస్తామనే హామీ ఎందుకు కార్యరూపం దాల్చడం లేదని మంజుశ్రీ ప్రశ్నించారు.
గాంధీజీ ఉద్యమం చేయకపోతే దేశానికి స్వాతంత్య్రం వచ్చేదా.. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ముందుండి ఉద్యమం చేయకుంటే తెలంగాణ అయ్యేదా అని మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ కార్యకర్తలకు ధైర్యం కల్పించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెసోళ్లు గల్లాలు పట్టుకుని కొట్టుకునే పరిస్థితిని మనం చూస్తామని చురలకంటించారు. ఇప్పటికే వర్గపోరు చాపకింద నీరులా విస్తరిస్తోందని, ఎన్నికలు పూర్తకాగానే కాంగ్రెస అసలు విశ్వరూపం బయట పడుతుందని ఆయన అన్నారు. పార్టీకి అండగా ఉండేవారే అసలు సిసలు కార్యకర్తలని, తమ అవసరాలకు పార్టీలు మార్చేవారు పార్టీ నాయకులు కారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ముస్లింలపై ఎక్కడైనా దాడులు జరిగిన వార్తలు విన్నామా అని అన్నారు. ఏనాడూ జై తెలంగాణ అనని బీజేపీ నేతలకు ప్రజలు ఎందు కు ఓటు వేయాలని ఫరూక్ హుస్సేన్ ప్రశ్నించారు. సమష్టి కృషితో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరా రు. సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, జడ్పీటీసీ కొండల్రెడ్డి, ఎంపీపీ సరళ, నాయకులు ఫయీమ్, శివరాజ్పాటిల్, రాజేశ్వర్రావు దేశ్పాండే, కాసాల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, ఆత్మకూర్ నగేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజేందర్, దేవేందర్రెడ్డి, జైపాల్రెడ్డి, చింతా గోపాల్, మనోహర్గౌడ్తో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.