సంగారెడ్డి, ఏప్రిల్ 6: ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ. 25వేలు, ఆత్మహత్య చేసు కున్న రైతులకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలని మాజీమంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతు దీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ మామీద, మా పార్టీ మీద కోపం రైతులపై చూపించవద్దన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలు ఇచ్చిన హామీలు, రైతులు పండించిన పంటలకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శిచారు. రుణమాఫీ లేదు, పంటలకు పెట్టుబడి సాయం లేదన్నారు. కేసీఆర్ పాలనలో కరోనా కష్టం వచ్చినా ఈ రెండు పథకాలు ఎన్నడూ అపలేదన్నారు.
అమలుకు నోచని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడంలో కాంగ్రెస్, బీజేపీలకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ముఖ్యంగా రోజురోజుకూ రాష్ట్రంలో అన్నదాతలు అప్పులతో చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. చనిపోయిన రైతులకు రూ. 20 లక్షల పరిహారం అందజేయాలన్నారు. లక్షల ఎకరాల్లో వేసిన పంటలు ఎండిపోతున్నా రైతుల్లో ఆత్మైస్థెర్యం నింపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు పెద్దపీట వేసి సాగుకు మందే పెట్టుబడి సాయం అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మమ్మల్ని తిట్టండి.. కానీ రైతులను అదుకోండి అని మాజీమంత్రి హరీశ్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందూదొందేనని, మద్దతు ధర ఇస్తామని చెప్పి మాట తప్పడం ఆ పార్టీల నైజమని హరీశ్రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రైతులను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ కేవలం మత రాజకీయాలు చేస్తూ మరోసారి అధికారంలోకి రావాలని చేస్తున్న ప్రయత్నం విఫలవుతుందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..రాష్ర్టానికి కరువు తెచ్చిందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్రావు భరోసానిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, డీసీసీబీ వైస్చైర్మన్ పట్నం మాణిక్యమ్, జడ్పీటీసీ కొండల్రెడ్డి, ఎంపీపీలు, నాయకులు గాలి అనిల్కుమార్, దేవీప్రసాద్, రాజేశ్వర్రావు దేశ్పాండే, కాసాల బుచ్చిరెడ్డి, మల్లాగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మా మీద, బీఆర్ఎస్ మీద కోపం రైతులపై చూపించకండి… ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్ధానాలను ప్రభుత్వం అమలు చేయాలి. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ పథకాలు ఎన్నడూ అపలేదు. రైతులు పండించిన పంటలకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెసోళ్లు చేతులెత్తేశారు. రైతులకు రుణమాఫీ లేదు.. పంటలకు పెట్టుబడి సాయం లేదు.. అమలుకు నోచని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే. రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.20లక్షల పరిహారం అందజేయాలి.
– సంగారెడ్డి రైతుదీక్షలో మాజీమంత్రి హరీశ్రావు
రైతుల పక్షపాతిగా కేసీఆర్ పాలన చేశారని, పార్టీలపై కోపం రైతులపై చూపించలేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఉత్తుత్తి మాటలతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ నైజమని ధ్వజమెత్తారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందన్న విషయం కాంగ్రెస్కు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. సాగు, తాగునీరు లేక పూర్వం కాంగ్రెస పాలనలో ఉన్న పరిస్థితి మళ్లీ మొదలైందని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అమలుకానీ హామీలపై రైతులకు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు.