సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 8: సిద్దిపేట గడ్డ..బీఆర్ఎస్ అడ్డా అని, మన నేల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని.. మీరు 30 రోజులు కష్టపడితే..మీకు అండగా ఉంటానని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్లో సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్ విద్యార్థి, యువజన, సోషల్ మీడియా వారియర్స్తో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి మాజీమంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ రాకపోతే, సిద్దిపేట జిల్లా అయ్యేదా.. ఇంత అభివృద్ధి జరిగేదా అన్నారు. ఇదంతా బీఆర్ఎస్ వల్లనే జరిగిందన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని ఎంతోమంది యువకులు తెలంగాణ పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వారియర్స్ తిప్పకొట్టాలన్నారు. మీలో నుంచే రేపటి తరం నాయకులు పుడతారన్నారు. కనీసం 25 శాతానికి తగ్గకుండా స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తామన్నారు. భవిష్యత్లో ఏ అవసరం ఉన్నా.. ఆపదైనా, సంపద అయినా, కష్టమైనా, సుఖమైనా..తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కంటి రెప్పలా యువకులను కాపాడుకుంటానని చెప్పారు. దేశంలో ఏ అవార్డు ఇచ్చినా.. సిద్దిపేట పేరు లేకుండా అవార్డు లేనేలేదన్నారు. పదోతరగతి ఫలితాల్లో కూడా సిద్దిపేట జిల్లాను అగ్రగామిగా నిలిపామన్నారు.
దానగుణం, కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయనను గెలుపించడానికి మనమంతా కృషి చేయాలన్నారు. విద్యానిధి ద్వారా విద్యార్థులకు సాయం చేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజల్లో చర్చ పెట్టాలన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అయినవాళ్లను కాంగ్రెస్కు, కానివాళ్లు కారుకు ఓటువేయాలన్నారు. రూ.4 వేల పింఛన్, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500, పంటలకు రూ.500 బోనస్, రైతుబంధుపై కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. మోసం చేసిన కాంగ్రెసోళ్లకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్రావు కూడా ఎడ్లు, బండి, నిరుద్యోగ భృతి అని చెప్పి అక్కడి ప్రజలను మోసం చేస్తే.. దుబ్బాక ప్రజలు 54 వేల ఓట్లతో కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. దుబ్బాకలో చెల్లని వ్యక్తి సిద్దిపేటలో చెల్లుతాడా.. అని అడిగారు. అనేక గ్రామాల్లో ఆలయాలకు నిధులు ఇచ్చానని, సిద్దిపేట జిల్లా కావడం, నీళ్లు, రైలు ఇలా అన్ని బీఆర్ఎస్ వల్లనే వచ్చాయన్నారు. జిల్లాలు రద్దు చేస్తే సిద్దిపేట జిల్లా ప్రజలు కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెడతారన్నారు. అసెంబ్లీలో తాను కాంగ్రెస్ పార్టీని నిలదీయాలంటే బీఆర్ఎస్కు ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు.
తాను తీసుకొచ్చిన వెటర్నరీ కళాశాలను కొడంగల్కు తరలించారని.. రూ.150 కోట్ల అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ నిలిపివేసిందన్నారు. సిద్దిపేటపై రేవంత్రెడ్డికి అంత పగ ఎందుకు అని ప్రశ్నించారు. మనల్ని ఆగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మీరు ఎక్కడికి వెళ్లినా సిద్దిపేట గడ్డ గౌరవం పెరిగేలా పనిచేశామన్నారు. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా పని చేశానని.. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా 18 గంటలు పని చేశానన్నారు. నా ఊపిరి ఉన్నంత కాలం సిద్దిపేట గడ్డ కోసం పని చేస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు మేరుగు మహేశ్, యాదగిరి, రజనీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 8: పనిచేసినచోటే ప్రజా సేవ చేసేందుకు ఎంపీగా పోటీ చేస్తున్నానని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. మీరంతా సైనికుల్లా పని చేసి ఎంపీగా గెలిపించాలన్నారు. ఐఏఎస్ అధికారిగా ఇకడ ఐదేండ్లు పనిచేసిన ఘనత నాకే దకిందని, మాజీసీఎం కేసీఆర్, హరీశ్రావు సహకారంతో సిద్దిపేట జిల్లాను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దానన్నారు. ప్రజలకు సేవచేయాలనే ఆరాటంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని యువతకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. నిరుపేదల చదువు కష్టాలు కళ్లారా చూశానని, యువకుల కోసం రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు.
పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు అధ్యాపకులతో ఉచిత కోచింగ్ ఇప్పిస్తానని, వృత్తి నైపుణ్య శిక్షణ అందించి, 6 మాసాలకోసారి జాబ్మేళా ఏర్పాటు చేసి. ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి రూ.2 కోట్లు వెచ్చించి ఫంక్షన్ హాళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్తోపాటు నిరుపేదలకు కేవలం రూ.1కే అందించనున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటువేయాలని పిలుపునిచ్చారు. 35 రోజులు మీరు పనిచేస్తే ఐదేండ్లు మీ వెంట ఉండి మీకు సేవ చేస్తానన్నారు. ఉద్యమాల గడ్డ సిద్దిపేట..ఎంపీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించి పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం కల్పించాలన్నారు.