సంగారెడ్డి, ఫిబ్రవరి 23: ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలకు ఒడిదుడుకులు సర్వసాధారణమని, 2029 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు ధీమావ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం హరీశ్రావును కలిశారు. కొత్తగా విజయం సాధించిన కౌన్సిలర్లను మాజీ మంత్రి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు నిరుత్సాహపడొద్దన్నారు. 2029 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపొందిన కౌన్సిలర్లతో పాటు పోరాడి ఓడిన అభ్యర్థులను కూడా అభినందిస్తూ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ప్రజ ల ఆశీస్సులు, కార్యకర్తల కృషితో మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.